Cell Phone Shop Attack: హైదరాబాద్ పాతబస్తీలో గంజాయి మత్తులో యువకులు మరోసారి రెచ్చిపోయారు. చిన్న కారణంతో మొదలైన గొడవను పెద్దది చేసి, కత్తులతో వీరంగం సృష్టించి స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. చదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
చదర్ఘాట్లోని ముస్లిం మేటర్నటీ ఆసుపత్రి సమీపంలో ఉన్న ఓ సెల్ ఫోన్ రిపేర్ షాపుకు కొంతమంది యువకులు వచ్చారు. ఫోన్కు స్క్రీన్ గార్డ్ వేయించుకున్నారు. అయితే, ఆ స్క్రీన్ గార్డ్ ధర కేవలం రూ. 60. ఈ చిన్న మొత్తం విషయంలో షాపు యజమానితో సదరు యువకులు వాగ్వాదానికి దిగారు. అప్పటికే పూర్తిగా గంజాయి మత్తులో ఉన్న ఆ యువకులు, యజమానిపై బూతులతో విరుచుకుపడ్డారు.
వాగ్వాదం ముదరడంతో యువకుల ఆగడాలు మితిమీరాయి. “మేము లోకల్ రౌడీ షీటర్లం.. మాకే ఎదురు చెప్తావా?” అంటూ షాపు యజమానిపై దౌర్జన్యానికి దిగారు. ఈ క్రమంలో ఒక యువకుడు తన వెంట తెచ్చుకున్న కత్తిని బయటకు తీసి షాపు యజమానిని భయపెట్టాడు. అంతేకాకుండా, షాపు నడపాలంటే తమకు నెలనెలా మామూళ్లు (డబ్బులు) ఇవ్వాలని, లేకపోతే చంపేస్తామని బెదిరించారు.
ఈ దౌర్జన్యాన్ని షాపు యజమాని ధైర్యంగా తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించాడు. దీంతో నిందితుల బండారం బయటపడింది. కత్తితో హల్చల్ చేసిన వ్యక్తిని చదర్ఘాట్కు చెందిన సలీమ్గా స్థానికులు గుర్తించారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యాడు. పాతబస్తీలో గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయని, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Read Also: NTR District: న్యూ ఇయర్ వేళ యువకుల మధ్య రగడ.. అర్ధరాత్రి కర్రలతో ఫైటింగ్, రంగంలోకి పోలీసులు