Nara Lokesh: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెగా డీఎస్సీపై చేసిన వ్యాఖ్యలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని, జాబ్ క్యాలెండర్ ఊసే లేకుండా యువతను వంచించారని లోకేష్ మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రికార్డు స్థాయిలో 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడమే కాకుండా, 10 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేశామని గుర్తుచేశారు. త్వరలోనే మరో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని, జగన్ మరింత బిగ్గరగా ఏడవడానికి సిద్ధంగా ఉండాలంటూ ఎద్దేవా చేశారు.
పరీక్షల నిర్వహణపై జగన్ విమర్శలను తిప్పికొడుతూ.. పదో తరగతి పేపర్లు లీక్ చేసిన చరిత్ర ఉన్నవారే ఇతరులను దొంగలుగా భావిస్తారని లోకేష్ ధ్వజమెత్తారు. ఎంతో పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీలో అహర్నిశలు శ్రమించి, తమ ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన 16 వేల మంది అభ్యర్థులను జగన్ అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు సాధించిన వారందరికీ జగన్ వెంటనే లెంపలేసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర యువతకు ఉద్యోగాలు రాకుండా చేయడమే లక్ష్యంగా మెగా డీఎస్సీని ఆపడానికి జగన్ వర్గం కోర్టుల్లో దాదాపు 200 కేసులు వేయించిందని లోకేష్ ఆరోపించారు. అంతేకాకుండా గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి రాకుండా, పెట్టుబడులను అడ్డుకుంటూ యువత భవిష్యత్తును నాశనం చేయడానికి జగన్ కుట్రలు పన్నారని దుయ్యబట్టారు. ఇలా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న జగన్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నటికీ క్షమించరని లోకేష్ స్పష్టం చేశారు.
Also Read: అనంతపురం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. 30 మందికి తీవ్ర గాయాలు
మెగా డీఎస్సీ పై జగన్ చేసిన వ్యాఖ్యలపై X వేదికగా కౌంటర్ ఇచ్చిన మంత్రి లోకేష్ pic.twitter.com/mnxxbRK03Y
— BIG TV Breaking News (@bigtvtelugu) May 26, 2026