Guntur District: గుంటూరు జిల్లా తాడేపల్లిలో వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ప్రియురాలి నివాసానికి సమీపంలోని అరటి తోటలో ఆటో డ్రైవర్ వెంకటేశ్ దారుణ హత్యకు గురవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
స్థానికుల సమాచారం ప్రకారం.. వెంకటేశ్ అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శిరీష అనే మహిళతో ఏర్పడిన వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. గుర్తుతెలియని వ్యక్తులు వెంకటేశ్ను ప్రియురాలి నివాసానికి సమీపంలోని పొలాల్లోకి ఈడ్చుకువెళ్లి అత్యంత కిరాతకంగా హతమార్చారు. నిందితులు అతడిపై పదునైన ఆయుధాలతో దాడి చేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.
వెంకటేశ్ మృతిపై అతడి భార్య, కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ ప్రణాళికాబద్ధంగా జరిగిన హత్యేనని వారు ఆరోపిస్తున్నారు. శిరీషే దగ్గరుండి ఈ హత్య చేయించిందని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయని మృతుడి బంధువులు పేర్కొన్నారు.
మృతుడి బంధువుల సమాచారం వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్లూస్ టీం సహాయంతో ఘటనా స్థలంలో వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ALSO READ: Kirshna Statue: కృష్ణ విగ్రహాన్ని తీసేయండి.. భీమవరంలో కొత్త రచ్చ