Valentine’s Day Crime: వాలెంటైన్స్ డే రోజున భర్తతో సరదాగా గడిపిన ఓ భార్య.. కొద్ది గంటల వ్యవధిలోనే అతడి చేతిలో దారుణ హత్యకు గురైంది. హరియాణా (Haryana)లోని బహదుర్ గర్ (Bahadurgarh) ప్రాంతంలో జరిగిన ఈ దారుణ ఘటన.. ప్రస్తుతం యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. భార్యను చంపడమే కాకుండా ఈ పనిని దోపిడి గ్యాంగ్ చేసినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు భర్త. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా అసలు నిజాలు వెలుగు చూశాయి.
అసలేం జరిగిందంటే?
హర్యానాలోని బహదూర్ గర్ కు చెందిన బ్యాంక్ ఉద్యోగిని మహాక్ హత్య కేసును ఝజ్జర్ పోలీసులు (Jhajjar Police) 18 గంటల్లోనే ఛేదించారు. పోలీసుల కథనం ప్రకారం చార్టెట్ అకౌంటెట్ అన్షుల్ ధావన్ (Anshul Dhawan)తో మహాక్ (Mahak)కు గతేడాది సెప్టెంబర్ 25న వివాదం జరిగింది. మహాక్ హెడ్ఎఫ్ సీ బ్యాంక్ లో పనిచేస్తోంది. ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో గురుగ్రామ్ లో పనిచేస్తున్న అన్షుల్ నుంచి పోలీసులకు ఫోన్ వచ్చింది. గుర్తు తెలియని దుండగులు వచ్చి దోచుకోవడానికి ప్రయత్నించారని.. ఈ క్రమంలో తన భార్య గొంతుకోసి పారిపోయారని ఫిర్యాదు చేశాడు.
పొంతనలేని సమాధానాలు..
అన్షుల్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగి.. దర్యాప్తు ప్రారంభించారు. అయితే భర్త ఇచ్చిన వాంగ్మూలంలో అనేక లోపాలను దర్యాప్తు బృందాలు గుర్తించాయి. దోపిడి జరిగిన తీరు గురించి పలు ప్రశ్నలు వేయగా ప్రతీసారి పొంతనలేని సమాధానాలు అన్షుల్ ఇస్తుండటంతో పోలీసుల అనుమానం బలపడింది. దీంతో తమదైన శైలిలో అన్షుల్ ను విచారించగా.. భార్యను తానే హత్య చేసినట్లు అతడు అంగీకరించాడు. భార్యపై ఉన్న అనుమానంతో ఆమెను బలితీసుకున్నట్లు స్పష్టం చేశాడు. ఈ విషయమై ఇరువురి మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవని ఇక వాటిని భరించలేక అడ్డుతప్పించుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాడు.
Also Read: Front Load vs Top Load Price: రెండింటిలో ఏ వాషింగ్ మిషన్ ధర ఎక్కువ? అందుకు గల కారణాలేంటి?
కత్తితో గొంతుకోసి.. ఆపై కత్తెరతో..
నిందితుడు అన్షుల్.. వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14) సందర్భంగా భార్యను డిన్నర్ కు సైతం తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో భార్య ఎంతో సంతోషంగా భర్తతో ఉందని పేర్కొన్నారు. ఈ విందు జరిగిన కొద్ది గంటల్లోనే భార్యను అంతమెుందించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అయితే తన అల్లుడి ప్రవర్తన తొలి నుంచి అనుమానస్పదంగానే ఉండేదని మహాక్ తండ్రి కృష్ణ కథురియా ఆరోపించాడు. కాగా, హత్య జరిగిన సమయంలో కత్తిపై తన వేలిముద్రలు పడకుండా అన్షుల్ జాగ్రత్త పడినట్లు పోలీసులు తెలిపారు. తొలుత భార్య గొంతును కత్తితో కోసి చంపాడని.. ఆ తర్వాత కత్తెరతో లోతైన గాయం చేశాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.