హైదరాబాద్లోని అత్తాపూర్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ దుర్మరణం పాలయ్యారు. తోటి సిబ్బందిని, స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
టోలీచౌకీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న అబ్దుల్ సత్తార్, మంగళవారం తన డ్యూటీ ముగించుకుని మెహిదీపట్నం నుంచి అత్తాపూర్ వైపునకు తన బైక్పై వెళ్తున్నారు. అత్తాపూర్ సమీపంలోని పిల్లర్ నెంబర్ 191 వద్దకు చేరుకోగానే.. వేగంగా దూసుకొచ్చిన ఒక డీసీఎం (DCM) వ్యాన్ ఆయనను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి సత్తార్ డీసీఎం టైర్ల కింద పడిపోవడంతో.. ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో డ్రైవర్ అత్యంత తెలివిగా వ్యవహరించారు. ‘బండిని రోడ్డు పక్కన పార్క్ చేస్తాను’ అని నమ్మబలికాడు. అయితే వాహనాన్ని పక్కకు తీస్తున్నట్లు నటించి, ఒక్కసారిగా వేగం పెంచి అక్కడి నుంచి డీసీఎంతో సహా పరారయ్యాడు. పోలీసులు వచ్చేలోపే నిందితుడు తప్పించుకోవడంతో స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు.
పోలీసుల దర్యాప్తు
సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి కారణమైన డీసీఎంను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ (CCTV) ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. విధి నిర్వహణలో ఉండి ఇంటికి చేరుకునే లోపే ప్రాణాలు కోల్పోయిన అబ్దుల్ సత్తార్ కుటుంబంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
ALSO READ: Top 20 News: చంద్రబాబు గుడ్న్యూస్.. నోబెల్ సాధిస్తే రూ. 100 కోట్లు , హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం