Road Accident: అతి వేగం ప్రమాదకరం.. పదే పదే రోడ్డు పక్కన తాటికాయంత అక్షరాలతో బోర్డులు పెడుతున్నా, వాహనాదారులు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లాలో అదే జరిగింది. వేగంగా వస్తున్న ఓ కారు వ్యవసాయ క్షేత్రంలోని బావిలోకి దూసుకెళ్లింది. అసలు ప్రమాదం ఎలా జరిగింది?
జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం.. బావిలోకి దూసుకెళ్లిన కారు
జగిత్యాల జిల్లా మోరపల్లి-తాటిపల్లి రహదారిపై రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వస్తున్న ఓ కారు అదుపు తప్పింది. నేరుగా వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. మోతె గ్రామానికి చెందిన 28 ఏళ్ల దాసరి అరుణ్.. జగిత్యాల పట్టణానికి చెందిన అశ్విన్, బోగ నివేశ్లతో కలిసి మోరపల్లిలో ఫ్రెండ్ ఇంట్లో విందుకు హాజరయ్యారు.
ఆ తర్వాత తిరిగి ఇంటికి కారులో బయలుదేరారు. ముగ్గురు యువకులు ప్రయాణిస్తున్న కారు.. తాటిపల్లి సమీపంలో అదుపు తప్పింది. నేరుగా వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. కారు బావిలో పడగానే పెద్ద ఎత్తున అశ్విన్, నివేశ్లు బయటకు వచ్చి కేకలు వేశారు. వెంటనే రైతులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
నాలుగు గంటల తర్వాత బయటకు.. ఒకరు మృతి ఇద్దరు సేఫ్
తాళ్ల సాయంతో అశ్విన్-నివేశ్లను పోలీసులు బయటకు తీశారు. ఘటన సమయంలో కారు నడుపుతున్న అరుణ్ సీటు బెల్టు ధరించి కనిపించాడు. ఆ సీటు బెల్టు అరుణ్ ప్రాణం తీసిందని, లేకుంటే బయటపడేవాడని స్థానికులు అంటులున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, క్రేన్ సాయంతో దాదాపు నాలుగు గంటలపాటు శ్రమించి వాహనం బయటకు తీశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అరుణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు ఫ్రెండ్స్కు గాయాలు అయ్యాయి. అరుణ్ మృతి విషయం తెలియగానే తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. ఎదిగిన కొడుకు కళ్ల ముందు ఈ లోకాన్ని విడిచిపెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
ALSO READ: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీ డ్రగ్స్ కలకలం.. రూ. 7 కోట్ల హైడ్రోఫోనిక్ గంజాయి సీజ్!