Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడడం తీవ్ర కలకలం రేపింది. హాంకాంగ్ నుంచి గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్కు తరలిస్తున్న దాదాపు 7 కోట్ల రూపాయల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. సాధారణ గంజాయితో పోలిస్తే ఈ హైడ్రోఫోనిక్ రకం చాలా ఖరీదైనది కావడంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.
అధికారుల వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన దీపక్ జోస్కుట్టి అనే వ్యక్తి కొన్ని వ్యక్తిగత పనుల మీద హాంకాంగ్ వెళ్లాడు. అక్కడ నుంచి తిరుగు ప్రయాణంలో ఎలాగైనా డ్రగ్స్ దాటించాలనే ప్లాన్తో సుమారు ఏడు కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని కొనుగోలు చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా దాన్ని తన వ్యక్తిగత లగేజీ బ్యాగుల్లో సర్దుకుని, క్యాథే పసిఫిక్ ఎయిర్లైన్స్ విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నాడు.
అయితే, విమానాశ్రయంలో లగేజీ స్క్రీనింగ్ చేస్తుండగా భద్రతాధికారులకు అతడి బ్యాగులపై అనుమానం వచ్చింది. దీంతో దీపక్ జోస్కుట్టిని పక్కకు పిలిచి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయగా అసలు రంగు బయటపడింది. ఏడు కోట్ల విలువైన గంజాయి దొరకడంతో అధికారులు వెంటనే దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, ఈ స్మగ్లింగ్ వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
Also Read: సీఎం రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం.. హరీష్ రావుపై మేడి రవిచంద్ర ఫైర్