Drugs Seize: తెలంగాణ ఈగల్ టీమ్ దిల్లీలో భారీ ఆపరేషన్ చేపట్టింది. 180 మంది ఈగల్ పోలీసులు, ఢిల్లీ పోలీసుల సహకారంతో దేశ రాజధానిలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. కొరియర్ సర్వీస్ ద్వారా తెలంగాణకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ఈగల్ టీమ్ గుర్తించింది. దీంతో తీగ లాగిత డొంక ఢిల్లీలో కదిలింది. ఈ డ్రగ్స్ రాకెట్ పై ఈగల్ టీమ్ ఎస్పీ సీతారాం స్పందించారు.
ఢిల్లీ నుంచి తెలంగాణకు కొరియర్ సర్వీస్ ద్వారా డ్రగ్స్ సరఫరాను గుర్తించామని తెలంగాణ ఈగల్ టీం ఎస్పీ సీతారాం తెలిపారు. నైజీరియన్స్ షూస్, బట్టల్లో డ్రగ్స్ పంపిస్తున్నారని, ఫోన్ కాంటాక్ట్ డిటైల్స్ ద్వారా పూర్తి వివరాలు రాబట్టామన్నారు. ఈ ఆపరేషన్ లో ఢిల్లీ పోలీసులు పూర్తి సహకారాన్ని అందించారని సీతారాం చెప్పారు. ఈ ఆపరేషన్లో 180 మంది పోలీసులు పాల్గొనగా, తెలంగాణలోకి దాదాపు 1975 మంది వినియోగదారులకు డ్రగ్స్ను సరఫరా చేయకుండా అడ్డుకోగలిగామని ఎస్పీ వెల్లడించారు. దీంతో ఈగల్ టీమ్ ఆపరేషన్ సక్సెస్ ఫుల్గా జరిగిందని తెలిపారు. మొత్తం రూ.13 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.
“డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ ఉద్దేశంలో భాగంగా ఈ ఆపరేషన్ చేపట్టాం. తెలంగాణకు వస్తున్న డ్రగ్స్ సప్లైను కట్ చేయాలి. ప్రజలకు డ్రగ్స్ పై అవగాహన కల్పించాలి ఇదే ఈగల్ టీమ్ ముఖ్య ఉద్దేశం. ఇటీవల హైదరాబాద్ లో ఓ కేసులో నిందితుడిని విచారిస్తే.. ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా హైదరాబాద్ కు సప్లై జరిగినట్లు గుర్తించాం. నిఘా పెడితే కొంతమంది నైజీరియన్ మహిళలు కొరియర్ సర్వీస్ ద్వారా డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించాం. షూస్, చెప్పులు, బట్టల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. దాదాపు 50 మంది డ్రగ్స్ పెడ్లర్లను గుర్తించాం. ఢిల్లీలో రెక్కీ చేసి తెలంగాణ నుంచి 105 మంది, ఢిల్లీలో పోలీసులు 75 మంది మొత్తం 180 మందితో ఈ ఆపరేషన్ చేశాం. 18 ప్రదేశాల్లో ఒకేసారి సోదాలు చేశాం. దాదాపు 51 మంది నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నాం” -ఈగల్ టీం ఎస్పీ సీతారాం
తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఢిల్లీలో డ్రగ్స్ రాకెట్ ను బట్టబయలు చేసింది. రెండు నెలలుగా శ్రమించి డ్రగ్స్ ముఠాను అదుపులోకి తీసుకుంది. వీరి నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ తో పాటు డబ్బులను సీజ్ చేసినట్లు సమాచారం. ఈగల్ టీమ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో , ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్తో కలిసి భారీ ఆపరేషన్ చేశారు. ఢిల్లీ పోలీసుల సహకారంతో నైజీరియన్ డ్రగ్ కార్టెల్ను పట్టుకున్నారు. ఢిల్లీలో మొత్తం ఇరవై చోట్ల ఒకేసారి దాడులు చేసి ఓవర్స్టేలో ఉన్న 50 మందికి పైగా నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. నోయిడా, గ్వాలియర్, విశాఖపట్టణం ప్రాంతాల్లో కార్టెల్ కీలక సభ్యులను అరెస్టు చేశారు.
Also Read: Hyderabad Old City Blast: పాతబస్తీలో పేలుడు.. బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ వీడియో
తనిఖీల్లో 5,340 ఎక్స్టసీ గోలీలు, 250 గ్రాముల కోకైన్, 109 గ్రాముల హెరాయిన్, 250 గ్రాముల మెటాంఫెటమిన్ను పట్టుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.3.5 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారుల అంచనా. ఈగల్ టీమ్ ఢిల్లీలో 59 మ్యూల్ ఖాతాలు, 16 ప్రధాన కార్టెల్ హబ్లను గుర్తించారు. 107 బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. ఈ జాయింట్ ఆపరేషన్ తో కార్టెల్ సరఫరా నెట్వర్క్ ను పట్టుకున్నామని అధికారులు చెప్పారు. కొరియర్ సర్వీస్ లను ఉపయోగించుకుని, మహిళల ద్వారా డ్రగ్స్ ను దేశంలోని వివిధ ప్రాంతాలకు సప్లై చేస్తున్నట్లు ఈగల్ టీమ్ ఎస్పీ సీతారాం తెలిపారు.