Ravi Chandra: టీపీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై మాట్లాడేటప్పుడు హరీష్ రావు తన నోటిని అదుపులో పెట్టుకోవాలని, లేదంటే తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. సీఎంపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు హరీష్ రావు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
పదేళ్ల ఆర్థిక విధ్వంసం మీదే కదా!
తెలంగాణ ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని, గత పదేళ్ల పాలనలో మామ అల్లుళ్లు కలిసి అప్పుల కుప్పగా మార్చారని రవిచంద్ర మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన హరీష్ రావు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం ఇప్పుడిప్పుడే ఆర్థికంగా కోలుకుంటోందని ఆయన స్పష్టం చేశారు.
రైతులను తప్పుదోవ పట్టించే కుట్రలు
అధికార దాహంతో బీఆర్ఎస్ నేతలు నిత్యం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రవిచంద్ర ధ్వజమెత్తారు. నిన్నటివరకు ధాన్యం కొనుగోళ్లపై రైతులను రెచ్చగొట్టాలని చూసి విఫలమయ్యారని, ఇప్పుడు డిస్కమ్లు, కరెంట్, తాగునీటిపై కొత్త రాగాలు అందుకున్నారని విమర్శించారు. 24 గంటల కరెంట్ తీసేస్తారని, మోటార్లకు మీటర్లు పెడతారని హరీష్ రావు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు మీ అబద్ధాలను నమ్మే స్థితిలో లేరని, ఇప్పటికైనా సీఎంకు క్షమాపణ చెప్పి తీరాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read: వైసీపీ స్క్రీన్ప్లే.. జగన్ డైరెక్షన్.. విగ్రహాల ధ్వంసం వెనుక నిజాలు ఇవే- ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు