Hyderabad Crime: హైదరాబాద్ లో తీవ్రకలకలం రేపిన ఏటీఎం డబ్బు చోరి కేసును పోలీసులు ఛేదించారు. రూ.56 లక్షల డబ్బుతో పారిపోయిన వ్యాన్ డ్రైవర్ ను ఎట్టకేలకు గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ.34.90 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడ్ని జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు.
ఫిబ్రవరి 12న ఐటీ కారిడార్ లోని గోపన్ పల్లి యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం వద్ద ఈ చోరి జరిగింది. సంగం సెక్యూరిటీ సొల్యూషన్స్ సంస్థకు చెందిన సీఎంఎస్ వాహనం.. డబ్బు డిపాజిట్ చేసేందుకు ఏటీఎం వద్దకు వచ్చింది. మనీ డిపాజిట్ అధికారులు, సెక్యూరిటీ గార్డు.. ఏటీఎం లోపలికి వెళ్లగానే వ్యాన్ డ్రైవర్ అజిత్ కుమార్ అలియాస్ శివ (34) డబ్బుతో అక్కడి నుంచి ఉడాయించాడు. ఆ సమయంలో వ్యాన్ లో రూ.56 లక్షల నగదు ఉంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డ్రైవర్ శివ వ్యాన్ ను నల్లగండ్ల ప్రాంతంలో వదిలి డబ్బు ఉన్న ట్రంకు పెట్టెను తనతో తీసుకెళ్లాడు. పెట్టెను తెరిచే ఉద్దేశంతో ముందుగా ఓ లాడ్జిలోకి వెళ్లాడు. అక్కడ పెట్టెను ఓపెన్ చేసి డబ్బును తీసుకున్నాడు. అనంతరం ఆ డబ్బుతో పలు ప్రాంతాలకు తిరుగుతూ వచ్చాడు. అయితే నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టిన పోలీసులు.. ఎట్టకేలకు నిందితుడి ఆచూకి కనిపెట్టారు.
Also Read: Hyderabad Accident: ఫెరారీ కారు బీభత్సం.. బయటపడ్డ షాకింగ్ విజువల్స్.. చూస్తే వణుకు పుట్టాల్సిందే!
వ్యాన్ డ్రైవర్ శివను అరెస్టు చేసిన అనంతరం.. అతడి వద్ద ఉన్న రూ.34.90 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే మిగిలిన డబ్బును నిందితుడు ఏం చేశాడన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఆ డబ్బును నిందితుడు ఎవరికైనా దాచమని ఇచ్చాడా? లేదంటే జల్సాలకు ఖర్చు చేశాడా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల నియంత్రణ చట్టం (PSARA) కింద సంగం సెక్యూరిటీ ఏజెన్సీపైనా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలియజేశారు.
Also Read: Air Coolers Launch Mar 2026: ఏసీలు ఎందుకు దండగా.. ఈ కూలర్లు ఉండగా.. మార్చిలో క్రేజీ కూలర్లు లాంచ్!