Mudra Loan Scam: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ముద్రా రుణాల పేర జనం నుంచి డబ్బు కొల్లగొడుతున్న గ్యాంగును హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 8 మొబైల్ ఫోన్లు, 10 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన 36ఏళ్ల మహిళ నవంబర్ 6న ఇన్ స్టాగ్రాంలో ఓ లోన్ యాప్ ప్రకటన చూసి దానిని ఓపెన్ చేశారు. ఆ వెంటనే క్లోజ్ కూడా చేసేశారు. కాగా, మరుసటి రోజు ఆమెకు 9773603466 నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి తాను ముద్రా లోన్ సర్వీస్ నుంచి మాట్లాడుతున్నానని, తన పేరు కిలా పవన్ కుమార్ అని పరిచయం చేసుకున్నాడు. మీకు 3 లక్షల రూపాయల రుణం మంజూరైందని చెప్పాడు.
ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు అవసరం లేదని చెప్పి అర్హత కోసం ఆధార్, పాన్ కార్డు వివరాలు తీసుకున్నాడు. ఆ తరువాత ఇన్సూరెన్స్ ఛార్జీల పేరుతో 7,200 రూపాయలు, టీడీఎస్ పేర 15వేలు డిమాండ్ చేశాడు. ఇలా రకరకాల కారణాలు చెప్పి బాధితురాలి నుంచి 1.08లక్షల రూపాయలు వసూలు చేశాడు. అయితే, లోన్ డబ్బులు మాత్రం ఆమె ఖాతాకు క్రెడిట్ చేయలేదు. దాంతో బాధితురాలు తనకు లోన్ వద్దని చెప్పి ఇచ్చిన డబ్బును వాపసు ఇవ్వమని అడుగగా క్యాన్సిలేషన్ ఫీజు పేర మరింత డబ్బు డిమాండ్ చేశాడు. అప్పుడు జరిగిన మోసాన్ని గ్రహించిన బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఇన్స్ పెక్టర్ శివచంద్ర, ఏఎస్ఐ ఉమతోపాటు సిబ్బందితో కలిసి దర్యాప్తు ప్రారంభించారు. పక్కాగా ఆధారాలు సేకరించి ఈ మోసానికి పాల్పడ్డ వరంగల్ జిల్లాకు చెందిన బోచు అరుణ్, గడ్డం భరత్, సామర్ల తిరుపతి, వెల్పుగొండ తరుణ్, చుక్క శ్యామ్ లను అరెస్ట్ చేశారు.
Also Read; AP liquor scam: సుప్రీంకోర్టులో రాజ్ కేసిరెడ్డికి చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ డిస్మిస్!
అరెస్ట్ చేసిన నిందితులను విచారించగా పలు కీలక వివరాలు వెలుగు చూశాయి. స్వయం ఉపాధిని కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముద్రా పేర రుణాలను మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిని కృష్ణ ఎలియాస్ కిట్టూ, పవన్ లు అక్రమంగా డబ్బు సంపాదించటానికి అవకాశంగా మలుచుకున్నారు. ఈ క్రమంలో బోచు అరుణ్, గడ్డం భరత్, సామర్ల తిరుపతి, వెల్పుగొండ తరుణ్, చుక్క శ్యామ్ లను తమ కాల్ సెంటర్ లో చేర్చుకున్నారు. దానికి ముందు కృష్ణ ఈ అయిదుగురికి కోల్ కతాలో వసతి కల్పించి ఫోన్లు ఎలా చేయాలి? ఎలా మాట్లాడాలి? అవతలి వారిని నమ్మించి ఎలా ఉచ్ఛులోకి లాగాలి? అన్న దానిపై శిక్షణ ఇచ్చాడు.
ఇలా ట్రైనింగ్ తీసుకున్న అయిదుగురు ప్రతీరోజూ 180 నుంచి 200 ఫోన్ కాల్స్ చేస్తూ తమ వలలో చిక్కిన వారి నుంచి డబ్బు గుంజి కృష్ణ, రాహుల్ లకు పంపించటం మొదలు పెట్టారు. ఇలా కొల్లగొట్టిన డబ్బు నుంచి 30 శాతం కమీషన్ గా తీసుకునేవారు. ఈ మోసాలు మొదలు పెట్టటానికి ముందు అయిదుగురు కూలీ పని చేస్తూ జీవనం గడిపేవారని డీసీపీ అరవింద్ బాబు తెలిపారు. సోషల్ మీడియాలో సులభంగా లోన్లు ఇస్తామంటూ వచ్చే ప్రకటనలను నమ్మవద్దని సూచించారు. రిజర్వ్ బ్యాంక్ గుర్తింపు పొందిన బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల ద్వారా మాత్రమే రుణాలు తీసుకోవాలని చెప్పారు. అపరిచిత యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవద్దన్నారు. ప్రభుత్వ ముద్రా లోన్ స్కీంల గురించి వాట్సాప్, ఫేస్ బుక్ ప్రకటనలు ద్వారా ప్రచారం చేయదని చెప్పారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నెంబర్ కు ఫోన్ చేయాలన్నారు. దాంతోపాటు cybercrime.gov.in లో ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.
Also Read: YS Sharmila: సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్.. వైసీపీ వాకౌట్ సిగ్గుచేటు.. సూటి ప్రశ్నలతో ఏకిపారేసిన షర్మిల