Hyderabad Drugs: తెలంగాణ పోలీసులు డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. పోలీసులు ఎంత నిఘా పెట్టినా.. డ్రగ్స్ రవాణా మాత్రం ఆగడంలేదు. న్యూఇయర్ వేడుకలే లక్ష్యంగా డ్రగ్స్ రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్ రవాణా చేస్తున్న ఓ ముఠాను హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధిలో పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు డ్రగ్స్ పెడ్లర్లు, ఐదుగురు వినియోగదారులను అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ వారిలో మల్లారెడ్డి ఆసుపత్రిలో పని చేసే ఇద్దరు వైద్యులు, ముగ్గురు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ఉన్నట్లు సమాచారం. ఓ ప్రైవేట్ పాఠశాల వద్ద డ్రగ్స్ విక్రయిస్తుండగా, మేడ్చల్ పోలీసులు నిఘా పెట్టి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల నుంచి రూ. 4 లక్షల విలువ చేసే 70 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ , రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వినియోగించేందుకు బెంగుళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ రవాణా చేస్తుండగా పట్టుకున్నామని మేడ్చల్ ఎస్వోటీ పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ ను డ్రగ్స్ భూతం వీడడంలేదు. తాజాగా టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం రేగింది. మాసబ్ట్యాంక్ పరిధిలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడి పేరు తెరపైకి వచ్చింది. దీంతో టాలీవుడ్, బాలీవుడ్లో మళ్లీ డ్రగ్స్ చర్చనీయాంశంగా మారింది. మాసబ్ట్యాంక్ పోలీసులు సహా తెలంగాణ ఈగల్ టీమ్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో భారీగా కొకైన్, MDMA స్వాధీనం చేసుకున్నారు. ట్రూప్ బజార్కు చెందిన నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వీ అనే ఇద్దరు వ్యాపారులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని విచారించగా.. నలుగురు రెగ్యులర్ కస్టమర్లు పేర్లు చెప్పారు.
వీరిలో ఒకరు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ అని పోలీసులు తెలిపారు. అమన్ ప్రీత్ సింగ్ వీరి దగ్గర రెగ్యులర్ గా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 43 గ్రాముల కొకైన్, MDMA డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న హీరోయిన్ సోదరుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈగల్ టీం, మాసబ్ట్యాంక్ పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
Also Read: AP TG Weather: తెలుగు రాష్ట్రాలపై చలి పంజా.. మరో రెండ్రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు