AP TG Weather: తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. రానున్న రెండు రోజుల్లో చలి తీవ్ర మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో నేడు, రేపు చలి తీవ్రత అధికంగా ఉంటుందని అంచనా వేసింది. రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు పడిపోయే ఛాన్స్ ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణ వ్యాప్తంగా చలి గాలుల తీవ్రత పెరిగింది. ఏడు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపు నమోదయ్యాయి.
హైదరాబాద్ లో గాలి నాణ్యత తగ్గుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 230 దాటి ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. గరిష్టంగా అమీన్పూర్ 289 పాయింట్లు, గచ్చిబౌలిలో 286, మాదాపూర్, విట్టల్రావు నగర్లో 230 పాయింట్లుగా రికార్డైంది. కూకట్పల్లి, బాలానగర్, సనత్నగర్, సోమాజిగూడ, కోఠి, బంజారాహిల్స్, మణికొండ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, బొల్లారం ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక 200 పాయింట్లు దాటింది. గాలి నాణ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Also Read: HMWSSB: హైదరాబాదీలకు ముఖ్య గమనిక.. ఈ ప్రాంతాల్లో 36 గంటలు నీటి సరఫరా బంద్
ఏపీలో సైతం రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య చలి గాలులు వీస్తున్నట్లు పేర్కొంది. ఏజెన్సీ జిల్లాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ఉదయం 10 గంటలకు కూడా దట్టమైన పొగ మంచు కురుస్తోంది. రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోతున్నాయి. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రకృతి అందాలు చూసేందుకు పర్యాటకులు క్యూకడుతున్నారు.
చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో పిల్లలు, వృద్ధులను తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లాల్సివస్తే మాస్క్, స్వెట్టర్లు ధరించాలని చెబుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో గోరు వెచ్చని నీరు తాగాలని సూచిస్తున్నారు.