Hyderabad Crime: హైదరాబాద్ లో గట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ దందా చేస్తున్న నైజీరియన్ మహిళను ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు. ఆమె నుంచి 7.5 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. నైజీరియా దేశానికి చెందిన జేమ్స్ టెస్లింగ్ ఇమ్మాన్యుయెల్.. కొంతకాలం క్రితం భారత్ కు వచ్చింది. తేలికగా డబ్బు సంపాదించేందుకుగాను తన దేశానికే చెందిన పెడ్లర్లతో సంబంధాలు ఏర్పరుచుకుంది.
ముంబయిలో ఉంటున్న ఓ పెడ్లర్ నుంచి తరచూ కొకైన్ ను గ్రాము రూ.15 వేలకు కొని హైదరాబాద్ తీసుకొచ్చి గ్రాము రూ.30 వేలకు అమ్ముతోంది. జేమ్స్ టెస్లింగ్ చేస్తున్న ఈ దందా గురించి సికింద్రాబాద్ డీటీఎఫ్ ఇన్స్ పెక్టర్ సౌజన్య పక్కాగా సమాచారాన్ని సేకరించారు. ఎస్ఐ శివకృష్ణ, సిబ్బందితో కలిసి నిఘా పెట్టారు.
Also Read: పుదుచ్చేరిలో కాంగ్రెస్ను గెలిపిస్తే.. తెలంగాణ తరహా సంక్షేమం.. భట్టి విక్రమార్క హామీ
జేమ్స్ టెస్లింగ్ శుక్రవారం ముంబయి నుంచి కొకైన్ కొని సికింద్రాబాద్ ప్యారడైజ్ ప్రాంతంలోని సన్ షైన్ హాస్పిటల్ వద్దకు డెలివరీ ఇవ్వటానికి వస్తున్నట్టు తెలుసుకుని సిబ్బందితో కలిసి మాటు వేశారు. సేకరించిన సమాచారం మేరకు జేమ్స్ టెస్లింగ్ ఆటోలో అక్కడికి చేరుకోగానే దాడి చేసి పట్టుకున్నారు. ఆమె నుంచి రూ.2.35 లక్షల రూపాయల విలువ చేసే 7.5 గ్రాముల కొకైన్ ను సీజ్ చేశారు. నిందితురాలిపై కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.
Also Read: ఎయిర్ ఫ్రైయర్ క్లీనింగ్లో.. ఈ తప్పులు చేస్తున్నారా? అయితే కొంపకొల్లేరే!