Food Safety: స్వేచ్ఛ బ్యూరో: అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలతో చికెన్ వంటకాలు చేస్తున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పై హెచ్ ఫాస్ట్ అధికారులు దాడి జరిపారు. దాదాపు 110 కిలోల ఫ్రైడ్ చికెన్, 15 లీటర్ల చొప్పున ఉన్న 6టిన్ల వంట నూనె, కృత్రిమ రసాయన ఆహార రంగులను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
హెచ్ ఫాస్ట్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ వివరాలను వెల్లడించారు. పాతబస్తీలోని న్యూ లాడ్ బజార్లో ఉన్న మెసర్స్ అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్ లో కల్తీ ఆహార పదార్థాలను తయారు చేసి అమ్ముతున్నట్టుగా తెలిసి హెచ్ ఫాస్ట్ అధికారులు దాడి చేశారు. తనిఖీ చేయగా అపరిశుభ్ర వాతావరణంలో రసాయనాలు ఉపయోగిస్తూ ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్టుగా వెల్లడైంది. ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ లేకుండానే ఈ దందా కొనసాగిస్తున్నట్టుగా తేలింది.
Also read: Today Movies in Tv : శనివారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు…
నిషేధిత ఫుడ్ కలర్స్ ఎంఎస్కేలయన్ గ్రీన్, రాస్ బెర్రీ రెడ్ లను ఉపయోగిస్తున్నట్టుగా వెల్లడైంది. వాడిన వంట నూనెను పదే పదే వాడుతున్నట్టుగా తెలిసింది. ఇలాంటి ఫుడ్ తినటం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదముందని డీసీపీ తెలిపారు. జీర్ణాశయ ఇన్ఫెక్షన్లు కూడా సోకుతాయన్నారు. పదే పదే వాడిన నూనెను ఉపయోగించడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని చెప్పారు. నిందితులపై కేసులు నమోదు చేసి హుస్సేనీ ఆలం పోలీసులకు అప్పగించినట్టు తెలిపారు.
Also Read: Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. లేబర్ కార్డుల దందాపై కదిలిన యంత్రాంగం!