TG20 League: స్వేచ్చ బ్యూరో: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) నిర్వహించనున్న టీజీ20 టోర్నీపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. వరుసగా చుట్టుముడుతున్న వివాదాలు..వెల్లువెత్తుతున్న ఆరోపణల నేపథ్యంలో అసలు ఈ టోర్నీ జరిగేనా? అన్న ప్రశ్న ముందుకొస్తోంది. పరిస్థితులను చూస్తుంటే ఈ టోర్నీ జరగటం కష్టమే అన్న అభిప్రాయం క్రికెట్ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.
త్వరలోనే టీజీ20 టోర్నీని నిర్వహించనున్నట్టు హెచ్సీఏ కొన్ని రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే దీనిపై టీసీఏ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దశాబ్ధాలుగా హైదరాబాద్ జిల్లాకు మాత్రమే పరిమితమైన హెచ్సీఏ తెలంగాణ పేరు మీద ఎలా టోర్నీ నిర్వహిస్తుందని ప్రశ్నించింది. ఇలాంటి టోర్నీ నిర్వహించాలంటే బీసీసీఐ అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. హెచ్సీఏ టోర్నీ నిర్వహణకు అనుమతి తీసుకుందా? తీసుకుంటే దానిని బహిరంగ పరచాలని డిమాండ్ చేసింది. అయితే, వీటిలో ఏ ఒక్క ప్రశ్నకు కూడా హెచ్సీఏ నుంచి స్పందన రాలేదు. మరోవైపు టోర్నీ నిర్వహణకు గవర్నింగ్ కౌన్సిల్ ను నియమించింది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది.
నామినేషన్ పద్దతిలో జరిగిన హెచ్సీఏ అధ్యక్షుని నియామకం చెల్లదంటూ ఇటీవల హైకోర్టు తీర్పు చెప్పింది. ఎన్నికలు జరిపి అధ్యక్షున్ని నియమించాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో అధ్యక్షుని నియామకమే చెల్లనపుడు ఆయన ఏర్పాటు చేసిన గవర్నింగ్ కౌన్సిల్ కు ఏ చట్టబద్దత ఉంటుందన్న ప్రశ్న ముందుకొచ్చింది. అయినా, హెచ్సీఏ వర్గాలు ఆటగాళ్ల వేలం పాటను నిర్వహించాయి. దీంట్లో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టార్స్ మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మలను ఫ్రాంచైజీలు దక్కించుకున్నట్టుగా ప్రకటించాయి. దీనిపై కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి.
Also read: పవన్ పై అందుకే కేటీఆర్ స్పందించడం లేదా!? కవిత మాటల్లో ఆంతర్యం ఇదేనా!?
స్టార్ క్రికెటర్లను అడ్డం పెట్టుకుని టీజీ20 టోర్నీ జరపటం ద్వారా హెచ్సీఏ వందల కోట్లు వెనకేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా వార్తలొచ్చాయి. అంతర్జాతీయ క్రికెటర్లు ఇలాంటి టోర్నీల్లో ఆడాలంటే బీసీసీఐ పర్మిషన్ తప్పనిసరని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. దాంతోపాటు ఆడటానికి క్రికెటర్లు కూడా తమ ఆమోదం తెలియ చేయాల్సి ఉంటుందని తెలిపాయి. మరి, తిలక్ వర్మ, మహ్మద్ సిరాజ్ లకు బీసీసీఐ అనుమతులు ఇచ్చిందా? ఈ ఇద్దరు తమ అంగీకారాన్ని తెలియచేశారా? అంటే హెచ్సీఏ వైపు నుంచి ఇప్పటివరకు సమాధానం రాలేదు.
ఇటువంటి పరిస్థితుల్లోనే టీజీ20 టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్ గా హీరో విజయ్ దేవరకొండను నియమించినట్టు హెచ్సీఏ ప్రకటించింది. అసలు అనుమతులు ఉన్నాయా? లేవా? అన్నది చెప్పకుండా టోర్నీ నిర్వహణకు సిద్ధపడటం, బ్రాండ్ అంబాసిడర్ గా హీరో విజయ్ దేవరకొండను నియమించటంపై టీసీఏ తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలో విజయ్ దేవరకొండతోపాటు మరో హీరో వెంకటేశ్, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తదితరులకు లీగల్ నోటీసులు పంపించింది. బీసీసీఐ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న టోర్నీని ప్రమోట్ చేస్తే చట్టపరమైన సమస్యలు ఎదుర్కోక తప్పదని స్పష్టం చేసింది.
ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా లోకాయుక్త జారీ చేసిన ఆదేశాలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయంగా మారాయి. హెచ్సీఏపై వచ్చిన ఆరోపణలు, పరిపాలనా పరమైన లోపాలపై లోకాయుక్తకు నాలుగు ఫిర్యాదులు అందాయి. వీటిని విచారణకు స్వీకరించిన లోకాయుక్త నాలుగు వారాల్లో అందిన ఫిర్యాదులపై విచారణ జరిపి సమగ్ర నివేదికను సమర్పించాలంటూ సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. గడువులోపు నివేదికలు ఇవ్వకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని స్పష్టం చేసింది. మరోవైపు తెలంగాణ క్రికెటర్లు ఇద్దరు టీజీ20 లీగ్ చట్టబద్దత, ప్రస్తుత పాలకవర్గానికి ఆ లీగ్ నిర్వహించే అధికారాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తుది తీర్పు వెలువడే వరకు టోర్నీ జరపకుండా ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలోనే అసలు టీజీ20 టోర్నీ జరుగుతుందా? లేదా? అన్న ప్రశ్న ఉదయిస్తోంది.
Also read: హైదరాబాద్లో ఇళ్లు కట్టేవాళ్లకు బిగ్ షాక్.. జీవో 626 జారీ రూల్స్ బ్రేక్ చేస్తే సర్టిఫికేట్ రద్దు!