Hyderabad: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఓ ముఠా రహస్యంగా మూగజీవాల నుంచి రక్తంతో సేకరిస్తుంది. పోలీసులు జాయింట్ ఆపరేషన్ తో ఈ ముఠా గుట్టు రట్టైంది. నాగారం సత్యనారాయణ కాలనీలో ఈ ముఠా దందాను పోలీసులు బట్టబయలు చేశారు. మేకలు, గొర్రెల నుంచి రక్తం సేకరించి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ముఠాను పట్టుకుని, ఇద్దరిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఒకరు స్థానిక మటన్ షాప్ యజమాని కాగా, మరొకలు ఫేక్ వెటర్నరీ డాక్టర్ గా పోలీసులు నిర్ధారించారు.
పోలీసుల తనిఖీల సమయంలో నిందితుల వద్ద మొత్తం 180 రక్తం ప్యాకెట్లను గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. మూగ జీవాల నుంచి సేకరించిన రక్తం, ప్లేట్లెట్లను కొన్ని వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తామని చెప్పుతూ.. అక్రమంగా రవాణా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే ఎలాంటి వైద్య పర్యవేక్షణ లేకుండా, ఇష్టారీతిన మేకలు, గొర్రెల నుంచి రక్తం సేకరించడం వల్ల మూగ జీవాలు ఒకటి రెండు రోజుల్లోనే మృతి చెందుతున్నాయని పోలీసులు తెలిపారు.
మూగ జీవాలను హింసించి క్రూరంగా రక్తం సేకరించడం పూర్తిగా చట్ట విరుద్ధమని జంతు ప్రేమికులు అంటున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అసలు మూగ జీవాల రక్తంతో ఏం చేస్తున్నారన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
Also Read: నకిలీ తుపాకీతో బంగారం షాపు చోరీ.. క్షణాల్లో పరార్, హైదరాబాద్లో ఘటన
రాత్రి పూట రహస్యంగా మేకలు, గొర్రెల నుంచి రక్తాన్ని సేకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆదివారానికి ఒకరోజు ముందు రక్తాన్ని సేకరించి, ఆ తర్వాత రోజు మటన్ షాప్లకు మూగజీవాలను విక్రయిస్తున్నారు. హ్యూమన్ బ్లడ్ అని రాసి ఉన్న ప్యాకెట్లలో మూగ జీవాల రక్తాన్ని సేకరించడం వెనుక ఏదైనా కుట్ర ఉందా? అని కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఏడాదిగా జరుగుతున్న ఈ అక్రమ రక్త దందా వెనుక ఎవరున్నారో లోతుగా దర్యాప్తు జరుగుతోందన్నారు.