సరదాగా సాగే సంక్రాంతి వేడుకల వెనుక ఉన్న ప్రమాదకరమైన చైనా మాంజా మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని వివేకానంద నగర్లో సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. గాలిపటం మాంజా గొంతుకు చుట్టుకోవడంతో తీవ్ర రక్తస్రావమై ఆ చిన్నారి మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
వివేకానంద నగర్కు చెందిన ఒక కుటుంబం తమ ఐదేళ్ల కుమార్తెతో కలిసి బైక్ పై ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుపై వేలాడుతున్న చైనా మాంజా బైక్ ముందు కూర్చున్న బాలిక మెడకు బలంగా చుట్టుకుంది. బైక్ వేగంగా ఉండటంతో ఆ దారం చిన్నారి గొంతును లోతుగా కోసింది. దీంతో ఒక్కసారిగా తీవ్ర రక్తస్రావం మొదలైంది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే చిన్నారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే.. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆసుపత్రికి చేరుకునే లోపే చిన్నారి మృతిచెందింది.
సమాచారం అందుకున్న కూకట్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిషేధిత చైనా మాంజా వినియోగంపై ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధిస్తున్నా, కొందరు వ్యాపారులు రహస్యంగా విక్రయిస్తుండటం వల్లే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఆ ప్రాంతంలో నిషేధిత దారాలను విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చిన్నారి మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ALSO READ: Rider Death: హెల్మెట్ పెట్టుకున్నాడు.. కానీ, చావు తప్పలేదు, కారణం ఈ తప్పే!