Cheap Helmet Turns Deadly: మోటార్ సైకిల్ మీద వెళ్లే ప్రతి ఒక్కరూ కచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని ట్రాఫిక్ పోలీసులు నిత్యం చెప్తూనే ఉన్నారు. హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్స్ కూడా విధిస్తున్నారు. అయినప్పటికీ, చాలా మంది హెల్మెట్ ధరించడం లేదు. కొంత మంది తక్కువ ధరలో నాసిరకం హెల్మెట్లను కొనుగోలు పెట్టుకుంటున్నారు. అయితే, సేఫ్టీ సర్టిఫికేషన్ లేని హెల్మెట్ పెట్టుకోవడం వల్ల చాల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఏపీలోనూ ఇలాంటి ఘటే జరిగింది.
విజయనగరం జిల్లాలోని బొండపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలోని గొట్లాం రోడ్డు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, బై ఢీకొన్న ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను పి. రామునాయుడు (33), ఎం. ఎల్లయ్య (48)గా గుర్తించారు. ఇద్దరూ దత్తిరాజేరు మండలం పోరలి గ్రామం నుంచి విజయనగరం పట్టణం వైపు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బైక్ నడిపిస్తున్న వ్యక్తికి హెల్మెట్ ఉన్నప్పటికీ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ హెల్మెట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫైడ్ హెల్మెట్ కాకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందన్నారు.
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన విజయనగరం పోలీసు సూపరింటెండెంట్ ఎ.ఆర్. దామోదర్.. నాణ్యత లేని హెల్మెట్ కారణంగానే రైడర్ చనిపోయినట్లు తెలిపారు. వెనుక ప్రయాణీకుడు హెల్మెట్ ధరించలేదని చెప్పాడు. ఇద్దరు వ్యక్తులు స్పాట్ లోనే మృతి చెందినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు రుజువైతే, అతనిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ నెలలో ఇప్పటి వరకు విజయనగరం జిల్లాలో APSRTC బస్సులు ఢీకొన్న ఘటనల్లో ఆరుగురు వాహనదారులు మరణించారని పోలీసులు వెల్లడించారు.
Read Also: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి కొత్త హెల్మెట్, ఫీచర్లు అదుర్స్ భయ్యా!
ప్రమాదం జరిగినా తలకు దెబ్బలు తగలకుండా ఉండాలంటే మోటార్ సైకిల్ నడిపేవాళ్లు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని పోలీసులు తెలిపారు. ISI సర్టిఫికేషన్ తో కూడిన హెల్మెట్లను కొనుగోలు చేయాలన్నారు. హెల్మెట్ ధరించిన తర్వాత కచ్చితంగా లాక్ చేయించుకోవాలన్నారు. కాస్త ఖరీదు అయినప్పటికీ, భద్రతా ఫీచర్లు ఉన్న హెల్మెట్లను మాత్రమే వాడాలన్నారు. ధర తక్కువ అని చూస్తే, ప్రాణాలు పోయే అవకాశం ఉందన్నారు. ఇకపై హెల్మెట్లు కొనే సమయంలో కచ్చితగా ఎక్కువ భద్రతను ఇచ్చే వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
Read Also: చూస్తుండగానే కాలి బూడిదైన మహీంద్రా ఈవీ, కంపెనీ ఏం చెప్పిందంటే?