Hyderabad: హైదరాబాద్ నగరంలోని బీఎన్ రెడ్డి నగర్ పరిధిలో ఉన్న టీచర్స్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. భార్యపై పెంచుకున్న అనుమానం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడ గ్రామానికి చెందిన నర్సింహ (60), వసంత (52) దంపతులు గత కొంతకాలంగా ఇక్కడ నివసిస్తున్నారు. నర్సింహ కూలి పనులు చేస్తుండగా, వసంత చుట్టుపక్కల ఇళ్లలో పనిమనిషిగా ఉంటూ సంసారాన్ని ఈదుతున్నారు.
అయితే.. గత కొంతకాలంగా భార్య ప్రవర్తనపై నర్సింహ అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంపై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. బుధవారం ఉదయం కూడా ఇదే విషయంలో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఆ కోపం చల్లారని నర్సింహ, ఎలాగైనా ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. వసంత యధావిధిగా తన పని కోసం ఇంటి నుంచి బయలుదేరగా, మార్గ మధ్యలో ఆమెను అడ్డుకున్నాడు. తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేయడంతో, తీవ్ర రక్తస్రావమై వసంత అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
నడిరోడ్డుపై జరిగిన ఈ ఘోరాన్ని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు నర్సింహను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Also Read: అన్న చేసిన తప్పుకు చెల్లి బలి.. వికారాబాద్లో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య!