Hyderabad: అమెరికాలో ఉన్నత విద్య చదవాలన్న కల నెరవేరకపోవడంతో తీవ్ర మనస్తాపంతో గుంటూరుకు చెందిన యువ వైద్యురాలు రోహిణి ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్లోని తన నివాసంలో నిద్రమాత్రలు మింగి సూసైడ్ చేసుకుంది.
డాక్టర్ రోహిణి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరుకు చెందిన రోహిణి రష్యాలో ఎంబీబీఎస్ చదివింది. అనంతరం అమెరికాలో ఉన్నత చదువులు చదవాలని, అక్కడే ప్రాక్టీస్ చేయాలని ఎంతగానో కలలు కన్నది. అందుకోసం ఇప్పటికే అమెరికా వెళ్లిన రోహిణి.. రెసిడెన్సీ, ప్రాక్టీస్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. జె-1 వీసా కోసం అప్లై చేసుకుంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల వీసాల జారీ నిబంధనలను కఠినతరం చేశారు. విదేశీ విద్యార్థులు, నిపుణులకు వీసాల జారీ విషయంలో అమెరికా కీలక మార్పులు చేసింది. దీంతో రోహిణికి వీసా జారీ కాలేదు. దీంతో ఆమె భారత్ కు తిరిగి రావాల్సి వచ్చింది.
యువ వైద్యురాలు రోహిణి గత ఏడాదిగా అమెరికాలో మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేందుకు జె-1 వీసా కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఇటీవల ఆమె వీసా దరఖాస్తు రిజెక్ట్ అయింది. దీంతో తన భవిష్యత్ కోసం కన్న కలలు నెరవేరలేదని మానసిక ఒత్తిడికి లోనైంది. ఈ క్రమంలో ఆమె హైదరాబాద్ లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వీసా రాకపోవడంతో రోహిణి డిప్రెషన్ కు గురై బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. రోహిణి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం ఆమె స్వస్థలమైన గుంటూరుకు తరలించారు కుటుంబ సభ్యులు.
Also Read: Suryapet Crime: భూవివాదం.. అక్క, మేనకోడళ్లను ట్రాక్టర్ తో ఢీకొట్టి హత్యాయత్నం