Minister Adluri Laxman: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ అవుతారని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే కేటీఆర్ హరీష్ రావు ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
జగిత్యాల కలెక్టరేట్లో ఆదివారం ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్హౌజ్కే పరిమితమయ్యారని అన్నారు. కేటీఆర్ హరీష్రావులను ఉద్దేశిస్తూ బావా బామ్మర్దులకు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అక్కడి ప్రజలు తగిన తీర్పు ఇచ్చారని మంత్రి తెలిపారు.
బీఆర్ఎస్ నేతలు తమ స్వంత మీడియా సోషల్ మీడియా ద్వారా ఐదు లక్షల కోట్ల కుంభకోణం అని అబద్ధాలు రాస్తున్నారని మంత్రి ఆరోపించారు. నిజంగా కుంభకోణం ఉంటే నిజాలు బయట పెట్టాలని వారికి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని శిథిలం చేసిందని విమర్శించారు. ఉద్యోగులకు ఒకటో తేదీకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి కల్పించిందని అన్నారు.
ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్ రెడ్డి పాలనలో జీతాలు సమయానికి చెల్లిస్తున్నారని మంత్రి తెలిపారు. అన్ని సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు అవుతున్నాయని చెప్పారు. అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే రోజులు పోయాయని అన్నారు. కేటీఆర్ చేసిన తప్పులు త్వరలోనే ప్రజల ముందు నిలబెడతాయని మంత్రి హెచ్చరించారు. ఆయన అరెస్టు తప్పదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనంతో పని చేయాలని సూచించారు. చీప్ పాలిటిక్స్ చేయొద్దని తెలిపారు.
ALSO READ: CM Revanth Reddy: భారత్ ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. సమ్మిట్ ఏర్పాట్ల పరిశీలన