Hyderabad Crime: హైదరాబాద్ లోని హోటళ్లు, రెస్టారెంట్లకు కుళ్లిన మాంసాన్ని సప్లే చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసారు. అతడి గోడౌన్ పై దాడి చేసి ఏకంగా 10 టన్నుల మాంసాన్ని సీజ్ చేశారు. డబ్బు సంపాదన కోసం జనం ఆరోగ్యంతో చెలగాటాలాడుతున్న వ్యక్తిని కటకటాలపాలు చేశారు.
హైదరాబాద్ మంగళ్ హాట్ ప్రాంతంలో నివాసముంటున్న అఫ్రోజ్ మాంసం వ్యాపారి. నగరంలోని వేర్వేరు హోటళ్లు, బిర్యానీ సెంటర్లకు మాంసాన్ని సప్లయ్ చేస్తుంటాడు. న్యాయంగా చేసే వ్యాపారంలో వస్తున్న లాభాలతో సంతృప్తి పడకుండా కొన్ని నెలలుగా కుళ్లిన మాంసం దందా మొదలు పెట్టాడు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి చనిపోయిన మేకలను తక్కువ ధరకు తెప్పించి ఇక్కడ వాటి మాంసాన్ని అమ్ముతున్నాడు.
Also Read: గ్యాస్ స్టవ్ vs ఇన్ఫ్రారెడ్.. డీప్ ఫ్రై వంటకాలకు.. ఏది బెస్ట్ అంటే?
ఈ మేరకు సమాచారం అందగా గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు మంగళ్ హాట్ ప్రాంతంలో అతను నడుపుతున్న రెండు గోడౌన్లపై దాడులు చేశారు. తనిఖీలు జరుపగా పూర్తిగా కుళ్లిపోయిన పది టన్నుల మాంసం దొరికింది. దానిని సీజ్ చేసిన అధికారులు అఫ్రోజ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కల్తీ వ్యాపారంలో అతనికి సహకరిస్తున్న మరో నలుగురిని కూడా అరెస్ట్ చేశారు. సీజ్ చేసిన మాంసం నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు తరలించారు.
Also Read: ఏప్రిల్ 1.. అందరినీ ‘ఫూల్స్’ చేసే రోజు అసలు ఎక్కడ ఎలా మొదలైంది? దీని వెనుక ఉన్న షాకింగ్ హిస్టరీ ఇదే!