Hyderabad Drugs Party: హైదరాబాద్లో డ్రగ్స్ పార్టీలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజా దాడుల్లో కీలక వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. డ్రగ్స్ కేసులో రెండోసారి పట్టుబడింది ప్రియాంకారెడ్డి. పట్టుబడినవారికి డ్రగ్స్ టెస్టులు చేశారు. వారిలో ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. వారిని రిమాండ్కు తరలించారు. పార్టీ సమయంలో వారి వద్ద లభించిన మత్తు పదార్థాల విలువ అక్షరాలా 15 లక్షలు రూపాయలు.
తెలంగాణలో డ్రగ్స్ లేకుండా చేసేందుకు ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తోంది. ప్రజల్లో అవేర్నెస్ కల్పించేందుకు సెలబ్రిటీల ద్వారా ప్రచారం చేయిస్తోంది. అయినా కొందరు మత్తు బాబులు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. మూడో కంటికి తెలియకుండా భాగ్యనగరంలోకి డ్రగ్స్ రప్పించే ప్రయత్నాలు జరిగాయి.. జరుగుతున్నాయి. అందుకే పోలీసులు సీక్రెట్గా నిఘా పెట్టారు.
డ్రగ్స్ పార్టీలో ఏం జరిగింది?
నార్సింగిలో డ్రగ్స్ పార్టీపై పోలీసుల దాడులు చేశారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిఆర్సి రెసిడెన్సీ భవనంలో గురువారం మధ్యాహ్నం పెంట్ హౌస్పై డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సైబరాబాద్ ఎస్ఓటీ, నార్సింగి పోలీసుల సంయుక్త దాడులు చేపట్టారు. పట్టుబడిన వారికి యూరిన్ టెస్ట్ కిట్టు ద్వారా పరీక్షలు నిర్వహించారు. వారంతా గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది.
అందులో ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. వారిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తన స్నేహితులతో కలిసి డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న ప్రియాంకరెడ్డి అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రియాంకరెడ్డి ఇదివరకే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యింది. ఆమె పట్టుబడడం ఇది రెండోసారి. వీరితో పాటు హష్ ఆయిల్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ALSO READ: స్నేహితుడే కాలయముడు
వీరి నుంచి రూ.15 లక్షల విలువ చేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులు నిజామాబాద్కు చెందిన వారు. ప్రియాంక రెడ్డి హైదరాబాద్ వాసిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, లోతుగా దర్యాప్తు చేపట్టారు. వారికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి కీలక విషయాలు వెల్లడికానున్నాయి.
డ్రగ్స్ నిర్మూలను ప్రయత్నాలు
తెలంగాణలో డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. అయినా పెడ్లర్లు చెలరేగిపోతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ విక్రయాలు చేస్తున్నారు. ముఖ్యంగా యువత, విద్యార్థులే టార్గెట్గా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. వారాంతాల్లో పబ్బులు, ఇతర ప్రైవేట్ పార్టీలపై నిఘా పెట్టారు పోలీసులు. డ్రగ్స్ విక్రయిస్తున్న వారిని ఇప్పటికే చాలామందిని అదుపులోకి తీసుకున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహనాలు వదలకుండా తనిఖీలు చేస్తున్నారు. అయినా కేజీల కొద్దీ గంజాయి, డ్రగ్స్ పట్టుబడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పూర్తయిన సందర్భంగా జరిగిన ప్రజా పాలన విజయోత్సవాల్లో హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, నేరాల కట్టడికి ఇంజనీరింగ్ విద్యార్థుల సహాయం తీసుకోవాలని పోలీసులకు సూచించారు.
పదేళ్లు పాలించిన బీఆర్ఎస్, డ్రగ్స్ అడ్డాగా మార్చింది ఆందోళన వ్యక్తం చేశారు. అయినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందన్నారు. కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపై ఓ కన్నేసి ఉంచాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. యువత డ్రగ్స్కు బలైతే రాష్ట్ర ప్రతిష్ట మసకబారుతుందని, జీవితాలను నాశనం చేసే అలవాట్లను వదులుకోవాలని యువకులకు సీఎం సూచించిన విషయం తెల్సిందే.