Hyderabad News: హైదరాబాద్లో పాత నోట్లు చక్కర్లు కొడుతున్నాయా? ఆ కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి కొందరు వ్యక్తులు నానాతంటాలు పడుతున్నారా? ఇంకా పాత నోట్లను హైదరాబాద్లో ఏయే బ్యాంకులు తీసుకుంటున్నాయి? నిందితులు హైదరాబాద్ని వేదికగా చేసుకుని వాటిని మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? ఆర్బీఐ చెప్పిన లెక్కల ప్రకారం మిగతా రెండు శాతం పాత నోట్లు ఎక్కడున్నాయి?
హైదరాబాద్ పాత కరెన్సీ నోట్లు చక్కర్లు కొడుతున్నాయి. నారాయణగూడలో టాస్క్ఫోర్స్ అధికారులు నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దాదాపు కోటి 90 లక్షల పాత కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. శాంతి థియేటర్ ఎదుట కెనరా బ్యాంక్ సమీపంలో ఇద్దరు చిక్కారు. వాటర్ వర్క్స్ కార్యాలయం సమీపంలో మరో ఇద్దరిని ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
మూడు బ్యాగుల నుంచి ఆయా కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో రద్దయిన రూ.500, రూ.1000 పాత నోట్లు ఉన్నాయి. ఆ నలుగుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, విచారణ మొదలుపెట్టారు. పాత నోట్లను హైదరాబాద్లో తీసుకుంటున్న వారెవరు?
నోట్ల మార్పిడికి కొన్ని బ్యాంకులు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాయా? లేకుంటే రూ. 2 కోట్లను ఎలా మార్చాలని ప్లాన్ చేశారు నిందితులు? దీని వెనుక ఎవరున్నారు? అనేదానిపై కూపీ లాగుతున్నారు పోలీసులు. RBI గైడ్ లైన్స్ ప్రకారం రద్దయిన నోట్లను మార్చుకునేందుకు ఇచ్చిన గడువు పూర్తి అయ్యింది.
ALSO READ: నువ్వులేక నేను లేను.. ప్రేమ విఫలమైందని జంట జలవన్మరణం
ఇకపై పాత నోట్లను మార్చడానికి ప్రయత్నాలు చేస్తే చట్ట ప్రకారం వారిని శిక్ష తప్పవని హెచ్చరించింది ఆర్బీఐ. అయినా నిందితులు హైదరాబాద్ కేంద్రంగా పాత నోట్లు మార్చడానికి ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పాత కరెన్సీని అక్రమ మార్గాల్లో ఉపయోగించడానికి ప్రయత్నాలు జరుగుతుండటం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం.
ఆర్బీఐ తన వార్షిక నివేదికలో నోట్ల రద్దుకు సంబంధించి కీలక వివరాలు వెల్లడించింది. చలామణిలో ఉన్న పాత నోట్లు రూ. 500, రూ. 1,000 వాటిలో దాదాపు 99.3 శాతం వచ్చాయి. మిగతా 7 శాతం మాత్రమే రాలేదు. వాటి విలువ కేవలం రూ. 10,720 కోట్లు. ఆ నోట్లు ఎక్కడున్నాయి? అన్నది అసలు ప్రశ్న. రూ. 2,000 నోట్లు 98 శాతం తిరిగి వచ్చాయని RBI వెల్లడించింది.
రద్దయిన కరెన్సీ దొరకడంతో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. నోట్ల రద్దు సమయంలో పాత నోట్లు ఎక్కువగా కొన్ని ప్రైవేటు బ్యాంకులు వెళ్లాయి. కమిషన్ ఆధారంగా కొన్ని బ్యాంకులు పాత నోట్లు తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. వాటి ఆధారంగా కేంద్ర సంస్థలు దర్యాప్తు చేపట్టాయి కూడా.
ఇక అసలు విషయానికి వద్దాం. పట్టుబడిన నలుగురు ఎక్కడ నుంచి పాత కరెన్సీని హైదరాబాద్కు తెచ్చారు? సిటీలో పాత నోట్లను తీసుకునేవారు ఎవరు? వ్యక్తులున్నారా? లేక బ్యాంకులు ఉన్నాయా? అనేది తేల్చాల్సిన అంశం. ఆ విషయం తెలిస్తే ఆ నోట్లకు సంబంధించి చిక్కుముడి వీడనుంది.