Cyber Frauds: స్వేచ్ఛ బ్యూరో: బక్రీద్ పండుగ సమీపించిన నేపథ్యంలో కేటుగాళ్లు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్ తెలిపారు. ఈ నేరాలపట్ల గొర్రెలు, మేకల విక్రయందారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బక్రీద్ పండుగ దగ్గరకు రావటంతో కమిషనరేట్ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో పెద్దఎత్తున గొర్రెలు, మేకల విక్రయాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. సరిగ్గా ఈ పరిస్థితిని కొందరు మోసగాళ్లు అవకాశంగా చేసుకుంటున్నారు.
నకిలీ ఫోన్ పే వంటి అప్లికేషన్లు సృష్టించి నగదు చెల్లించినట్టుగా స్క్రీన్ పై చూపించి గొర్రెలు, మేకలను తీసుకుపోతున్నారు. ఇలాంటి రెండు మోసాలు కంచన్ బాగ్, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ల పరిధుల్లో వెలుగు చూశాయి. కంచన్ బాగ్ ప్రాంతంలో ఆరుగురు వ్యక్తులు వచ్చి ఓ వ్యాపారితో బేరం కుదుర్చుకుని 80వేలు చెల్లించినట్టుగా నకిలీ యాప్ ద్వారా స్క్రీన్ షాట్ చూపించి జీవాలను తీసుకెళ్లిపోయారు. రాజేంద్రనగర్ లో నలుగురు వ్యక్తులు ఇలాగే 48వేల రూపాయల విలువ చేసే గొర్రెలు కొనిమోసానికి పాల్పడ్డారు.
Also read: బాల్క సుమన్ వ్యాఖ్యలపై.. సామ రామ్మోహన్ రెడ్డి ఫైర్..!
రద్ధీ కారణంగా డబ్బు జమ అయ్యిందా? లేదా? అన్నది చూసుకోలేకపోయిన వ్యాపారులు ఆ తరువాత మోసపోయినట్టు గ్రంహించి పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలోనే వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలని సీపీ సూచించారు. అవతలివారు చూపించే స్క్రీన్ షాట్లను నమ్మవద్దన్నారు. తమ బ్యాంకుల నుంచి నగదు జమ అయినట్టు మెసేజ్ వచ్చిందా? లేదా? అన్నది తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని తెలిపారు. బ్యాంకింగ్ యాప్ తెరిచి నగదు పెరిగిందన్న విషయాన్ని నిర్ధారించుకున్నాకే జీవాలను అప్పగించాలన్నారు.
Also read: టాలీవుడ్ నిర్మాతల షాకింగ్ నిర్ణయం.. సినిమాల పరిస్థితి ఏంటి..?