Ilaiyaraaja Rumours: సంగీత ప్రపంచంలో అందరికీ సుపరిచితులైన ‘ఇసైజ్ఞాని’ ఇళయరాజా వ్యక్తిగత జీవితంపై ఇటీవల సోషల్ మీడియాలో, కొన్ని యూట్యూబ్ ఛానెళ్లలో వస్తున్న పుకార్లపై ఆయన సోదరుడు, సీనియర్ డైరెక్టర్, సంగీత దర్శకుడు గంగై అమరన్ తీవ్రంగా స్పందించారు. ఇళయరాజా ఒంటరిగా ఉంటున్నారని, ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన తేల్చి చెప్పారు. “ఒక దిగ్గజ కళాకారుడి గురించి మాట్లాడేటప్పుడు కాస్త గౌరవం ఇవ్వండి.. ఆయన్ని ప్రశాంతంగా బతకనివ్వండి” అంటూ గంగై అమరన్ భావోద్వేగానికి లోనయ్యారు.
Reada slo-‘ధురంధర్’ టెక్నీషియన్పై కేసు నమోదు.. అసలు ఏం జరిగిందంటే?
ఇటీవల చెన్నైలో జరిగిన ‘ఉయిరినాయే’ అనే మ్యూజిక్ ఆల్బమ్ ఆడియో లాంచ్ వేడుకకు గంగై అమరన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఇళయరాజా ఆరోగ్యం, ఆయన వ్యక్తిగత జీవితంపై వస్తున్న రూమర్ల గురించి ప్రస్తావించగా.. గంగై అమరన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళ సినీ విమర్శకుడు, నటుడు బైల్వాన్ రంగనాథన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “ఇళయరాజా వయసు పైబడటంతో ఒంటరిగా జీవిస్తున్నారని, ఆయనను చూసుకోవడానికి ఎవరూ లేక ఇబ్బంది పడుతున్నారని” వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కోలీవుడ్తో పాటు సంగీత ప్రియుల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
ఈ పుకార్లపై గంగై అమరన్ స్పందిస్తూ.. “ఇళయరాజాకు ఎవరూ లేరని, ఆయన బాధపడుతున్నారని అనడానికి వీళ్లంతా ఏమైనా ఆయన ఇంటికి వచ్చి చూశారా? వాస్తవాలు తెలియకుండా కేవలం పబ్లిసిటీ కోసం, వ్యూస్ కోసం ఒకరి వ్యక్తిగత జీవితాన్ని రోడ్డుపైకి లాగడం ఎంతవరకు సమంజసం?” అని ప్రశ్నించారు. “ఇళయరాజా కుమారులు యువన్ శంకర్ రాజా, కార్తీక్ రాజా తమ తమ రంగాల్లో బిజీగా ఉంటూనే.. తండ్రితో నిరంతరం టచ్లో ఉంటున్నారు. ఇంట్లో ఏం జరుగుతుందో, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో బయటి వారికి తెలియదు. కేవలం హెడ్లైన్స్ కోసం ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం ఒక లెజెండరీ మ్యుజీషియన్ను అవమానించడమే అవుతుంది” అని మండిపడ్డారు.
ఇళయరాజా జీవనశైలి గురించి వివరిస్తూ.. “ఆయనకు ఎప్పుడూ నిశ్శబ్దంగా, ప్రశాంతమైన వాతావరణంలో గడపడం ఇష్టం. నేను ఆయన్ని కలవడానికి వెళ్లినప్పుడు కూడా చాలావరకు ఒంటరిగా కూర్చుని కొత్త ట్యూన్స్ కంపోజ్ చేసుకుంటూనో, సంగీతం రాసుకుంటూనో ఉంటారు. దానిని ఒంటరితనం అనకూడదు.. అది ఆయన కోరుకునే ప్రశాంతత. ఐదు దశాబ్దాలుగా కోట్లాది మందిని తన సంగీతంతో అలరించిన ఒక సీనియర్ కళాకారుడిని ఇలాంటి పుకార్లతో మానసికంగా బాధపెట్టవద్దని” గంగై అమరన్ కోరారు.
Read also-‘ఇరుముడి’ మాస్ మహారాజాకి కంబ్యాక్ ఫిల్మ్ అవుతుందా?.. రిలీజ్ ప్లాన్ ఎప్పుడంటే?
ఈ వివాదంపై తాను ఊరికే ఉండలేదని, సదరు వ్యాఖ్యలు చేసిన బైల్వాన్ రంగనాథన్కు స్వయంగా ఫోన్ చేసి నిలదీశానని గంగై అమరన్ వెల్లడించారు. దాంతో ఆయన తన తప్పు తెలుసుకుని, ఇళయరాజాపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారని పేర్కొన్నారు. “ఇళయరాజా ప్రస్తుతం చాలా సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నారు. ఆయనకు కావాల్సింది కేవలం ప్రశాంతత మాత్రమే. దయచేసి ఆయనను ఆయనకు నచ్చినట్లు, ప్రశాంతంగా జీవించనివ్వండి” అంటూ గంగై అమరన్ వేడుకలో అందరికీ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.