E Office: స్వేచ్ఛ బ్యూరో: ప్రభుత్వ పాలనలో సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి అన్ని శాఖల్లో ఈ–ఆఫీస్ అమలు కావాలని ఆదేశించారు. సీఎస్ నుంచి క్రింది స్థాయి సెక్షన్ ఆఫీసర్ల వరకు ఈ –ఆఫీస్ విధానంలోనే వర్క్ చేయాలని సీఎం నొక్కి చెప్పారు. గత కొన్ని రోజుల క్రితం ఫైలట్ మోడ్ లో కొన్ని శాఖల్లో ఈ ఆఫీస్ విధానాన్ని పరిశీలించారు. ఈ విధానంపై సంతృప్తి చెందిన సర్కార్ అన్ని శాఖల్లో అమలు చేయాల్సిందేనని సూచించింది. అంతేగాక ఆర్ధిక శాఖ కూడా ఈ –ఫైల్ విధానంలోని పైళ్లనే పరిశీలిస్తామని, ఫిజికల్ కాఫీలను ఎట్టి పరిస్థితుల్లో పరిగణించబోమని తాజాగా ప్రత్యేక సర్క్యులర్ కూడా ఇచ్చింది. అన్ని శాఖల హెచ్ వోడీలు ఈ ఆఫీస్ ద్వారా మాత్రమే ఫైళ్లను క్లియర్ చేయాలని ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ కూడా స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీంతో అన్ని శాఖలు ఈ –ఆఫీస్ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యాయి. కొన్ని శాఖలు ఇప్పటికే ప్రారంభించగా, మరి కొన్ని డిపార్ట్ మెంట్ లో ఈ వారంలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకోనున్నారు.
ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఫైళ్ల కదలిక కోసం వేచి చూసే రోజులకు కాలం చెల్లిపోతోంది. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, ప్రభుత్వ యంత్రాంగం ‘ఈ-ఆఫీస్’ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. దీని ద్వారా పారదర్శకత, జవాబుదారీతనం, వేగవంతమైన సేవలు అందుతాయని సర్కార్ భావిస్తుంది.అందుకే ఈ-ఫైల్ విధానాన్ని తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కాగితపు ఫైళ్లు ఒక టేబుల్ నుండి మరొక టేబుల్ కు వెళ్తుంటాయి. దీనివల్ల సమయం వృధా అవ్వడమే కాకుండా, ఫైళ్లు మిస్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. దీంతోనే ఈ ఆఫీస్ విధానాన్ని తెరమీదకి తీసుకువచ్చారు. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అభివృద్ధి చేసిన ఒక డిజిటల్ ప్లాట్ఫారమ్ ద్వారా ఫైళ్ల పుటాప్ , మూవింగ్, చెకింగ్, సైనింగ్ అంతా ఆన్ లైన్ లో నే జరిగిపోతాయి. నోటింగ్, డ్రాఫ్టింగ్, ఆమోదాలు, రికార్డు నిర్వహణ ఇలా అన్ని భద్రంగా ఉండేందుకు ఆన్ లైన్ విధానంలో చేయాలని సర్కార్ సూచించింది.
ఓ శాఖ సెక్షన్ కు వచ్చిన రిక్వెస్ట్ ను స్కాన్ చేసి ఈ పోర్టల్ లో ఎంట్రీ చేస్తారు. ఓ ఎన్ రోల్ నంబరుతోనే ఆ ఫైల్ సెక్షన్ ఆఫీసర్ నుంచి ప్రిన్సిపాల్ సెక్రటరీ వరకు తిరుగుతుంది. ఫైల్ స్టేటస్ కూడా కంప్యూటర్ లో సులువుగా చెక్ చేసుకోవచ్చు. ఫైల్ ఎక్కడ ఉన్నది? పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుంది. రీ మార్కులు ఉన్నాయా? తదితర అంశాలన్నీ ఈ –ఆఫీస్ లో పరిశీలించవచ్చు. సాధారణ ఫైల్ ఒక శాఖ నుండి మరో శాఖకు వెళ్లడానికి రోజుల కొద్ది సమయం పడుతుంది. కానీ ఈ-ఫైల్ విధానంలో ఒక్క క్లిక్తో ఫైల్ పై అధికారికి చేరుతుంది. దీనివల్ల పరిపాలనలో వేగం పెరుగుతుంది.అంతేగాక ఏ ఫైల్ ఏ అధికారి వద్ద, ఎన్ని రోజులుగా పెండింగ్లో ఉందో సిస్టమ్లో స్పష్టంగా కనిపిస్తుంది. దీనివల్ల ఫైళ్లను కావాలని తొక్కిపెట్టే అవకాశం ఉండదు. ప్రతి అధికారి తన బాధ్యతను సకాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. డిజిటల్ సిగ్నేచర్ ద్వారా అధికారులు పర్యటనల్లో ఉన్నా .. క్యాంప్ ఆఫీసుల్లో ఉన్నా ఫైళ్లను ఆన్లైన్లోనే సులువుగా క్లియర్ చేయవచ్చు. దీనివల్ల పాలన నిరంతరాయంగా సాగుతుంది.
Also Read: CM Revanth Reddy: అక్కడ రాత్రంతా వ్యాపారాలు.. నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త!
పాత విధానంలో కాగితపు ఫైళ్లు చెదలు పట్టడం, చిరిగిపోవడం ,అగ్ని ప్రమాదాల్లో కాలిపోయే ప్రమాదం ఉన్నది. గతంలో కొన్ని శాఖల్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ డిజిటల్ ఫైళ్లు క్లౌడ్ సర్వర్లలో భద్రంగా ఉంటాయి. బ్యాకప్ సౌకర్యం ఉండటం వల్ల డేటా ఎప్పటికీ పోదని ఈ ఆఫీస్ మానిటరింగ్ ఆఫీసర్లు చెప్తున్నారు. అంతేగాక వేల టన్నుల కాగితం వాడకం తగ్గుతుంది. తద్వారా ప్రభుత్వానికి స్టేషనరీ ఖర్చును తగ్గించడమే కాకుండా, చెట్లను కాపాడటం ద్వారా పర్యావరణానికి మేలు చేస్తుంది.ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే కొన్ని కీలక శాఖల్లో ఈ-ఆఫీస్ విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖలు, జిల్లా కార్యాలయాలు , స్వయంప్రతిపత్తి సంస్థలు కచ్చితంగా ఈ-ఫైల్ విధానాన్ని పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. పాత రికార్డులను కూడా డిజిటల్ మోడ్లోకి కన్వర్ట్ చేసే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.
మరోవైపు వివిధ శాఖల జిల్లా కార్యాలయాల నుంచి సెక్రటేరియట్ లోని ఆయా విభాగాలకూ కనెక్టివిటీ ని ఏర్పాటు చేయనున్నారు. జిల్లా స్థాయిలో ఆ శాఖకు సంబంధించిన ఫైల్ మూవ్ చేసినా..సెక్రటేరియట్ లోని ప్రిన్సిపాల్ సెక్రటరీ నేరుగా పరిశీలించి, ఫైల్ ను క్లియర్ చేసేలా ఈ సాప్ట్ వేర్ ను రూపొందించారు. ఈ విధానంపై ప్రస్తుతం ట్రయల్ నడుస్తున్నది. త్వరలోనే అందుబాటులోకి రానున్నది. మరోవైపు గతంలో ఓ సారి కేబినెట్ మీటింగ్ లోనూ ఈ–విధానాన్ని పరిశీలించారు. అంటే సిస్టపైనే కేబినెట్ ఎజెండా, మినిట్స్ అంతా కనిపించేలా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తీర్మానం, అప్రూవల్స్ వంటి వన్నీ ఆన్ లైన్ లోనే రికార్డు చేశారు. ఈ విధానాన్ని కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
Also Read: Digital Arrest Scam: జడ్జికే ‘డిజిటల్’ షాక్.. ఏకంగా రూ. 1.66 కోట్లు నొక్కేసిన సైబర్ కేటుగాళ్లు!