Sunitha Murder: హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగిన సునీత హత్య కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు మహేష్ తన మాజీ భార్యపై పెంచుకున్న కక్షే ఈ ఘాతుకానికి దారి తీసిందని పోలీసుల విచారణలో తేలింది. వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన మహేష్.. పక్కా పథకం ప్రకారమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం.
పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన మహేష్కు, కరీంనగర్కు చెందిన సునీతతో 2021లో వివాహమైంది. పెళ్లయిన నెల రోజులకే మహేష్ కెనడా వెళ్లగా.. దంపతుల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. అనంతరం సునీతను కెనడా తీసుకెళ్లినప్పటికీ.. ఐదు రోజుల్లోనే ఆమె తిరిగి వచ్చేసింది. మహారాష్ట్రలో మహేష్పై 498A కేసు పెట్టింది. ఈ క్రమంలో 2024లో వీరిద్దరూ చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సునీత తన సహోద్యోగి శ్రీనాథ్ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భవతి.
సునీత రెండో వివాహం చేసుకోవడం.. పెట్టిన కేసులు ఇంకా కొనసాగుతుండటం మహేష్ను కుంగదీశాయి. ఈ కేసుల వల్ల అతను తిరిగి కెనడా వెళ్లలేకపోయాడు.. తద్వారా ఉద్యోగం పోయింది. అదే సమయంలో అతని తల్లి గుండెపోటుతో మరణించడంతో.. తన జీవితం నాశనం కావడానికి సునీతనే కారణమని మహేష్ బలంగా నమ్మాడు. ఎలాగైనా ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు.
పథకం ప్రకారం సునీత నివసించే అపార్ట్మెంట్ సమీపంలోని ఒక హాస్టల్లో చేరిన మహేష్.. ఆమె కదలికలపై నిఘా ఉంచాడు. సంఘటనా రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో.. అర్బన్ క్లాప్ (Urban Company) వర్కర్నంటూ నమ్మించి అపార్ట్మెంట్లోకి ప్రవేశించాడు. నాలుగో అంతస్తులోని సునీత ఫ్లాట్లోకి వెళ్లి.. తన వెంట తెచ్చుకున్న కత్తులతో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీశాడు.
ప్రస్తుతం వనస్థలిపురం పోలీసులు మహేష్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ దారుణంలో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.