Dharani Portal: తీగ లాగితే డొంక కదిలినట్లుగా ధరణి పోర్టల్ వ్యవహారం ఉందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజల ఆస్తుల రక్షణకు నిర్మించవలసిన వ్యవస్ధని ఆనాటి ప్రభుత్వంలోని కొంతమంది ప్రముఖులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుకున్నారని మండిపడ్డారు. ధరణి పోర్టల్ లోని లొసుగులను ఆసరాగా చేసుకొని స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను కొల్లగొట్టిన సంఘటనపై ఉన్నత స్ధాయి కమిటీతో విచారణ జరిపించగా దిగ్బ్రాంతి కరమైన అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. ఇది సాధారణ సాంకేతిక లోపం కాదని వ్యవస్ధాగతంగా సృష్టించిన లోపాల ఫలితమని మంత్రి పొంగులేటి అన్నారు.
బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఉన్నతస్ధాయి కమిటీతో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆనాడు ధరణి పోర్టల్ కు సంబంధించి సెక్యూరిటీ ఆడిట్ చేసిన సమయంలో లోపాలు బయటపడ్డాయని.. వాటిని సరిదిద్దకుండానే అంతా సవ్యంగానే ఉన్నట్లుగా నివేదిక ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు. అలాగే మానవ ప్రమేయంతో తప్పులు చేసే విధంగా పోర్టల్ ను రూపొందించారని , భూముల లావాదేవీలకు సంబంధించి అనుమానాస్పదంగా ఉన్న భూముల సమాచారం లభించకుండా లాగిన్లు డిలిట్ చేశారన్నారు. అత్యంత రహస్యంగా ఉండవలసిన లాగిన్ వివరాలు లేకుండా పోయాయని ఉన్నత స్ధాయి కమిటీ విచారణలో ప్రాథమికంగా గుర్తించినట్లు చెప్పారు.
నిబంధనలకు విరుద్ధంగా జరిగిన భూలావాదేవీల సమాచారం లభించకుండా చేశారని మంత్రి ఆరోపించారు. ఫోరెన్సిక్ ఆడిట్లో కోడ్ ఆడిట్ నిర్వహించలేదన్న విషయం బహిర్గతమైందని, ఈ నేపథ్యంలో తక్షణమే ధరణి పోర్టల్ పై కోడ్ ఆడిట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ధరణి పోర్టల్ నిర్వహణా బాధ్యతను టెర్రాసిస్ అనే విదేశీ సంస్దకు అప్పగించడం వల్లే సమస్యలు ఎదురవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.
సీఎం రేవంత్రెడ్డి గారి సూచనల మేరకు ధరణి లోపాలను అడ్డుపెట్టుకొని ప్రభుత్వానికి రావలసిన స్టాంప్డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను కొల్లగొట్టిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. తప్పుచేసినవారు ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వానికి రావలసిన ప్రతిపైసాను వసూలు చేస్తామన్నారు. దీనిపై ఉన్నత స్ధాయి కమిటీ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకొని భవిష్యత్తులో అలాంటి పొరపాట్లు జరగకుండా ఏ చిన్న లోపానికి తావులేకుండా అధికారుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా ప్రజలకు ఫ్రెండ్లీగా ఉండేలా భూభారతి పోర్టల్ ను నిర్వహించాలని అధికారులకు సూచించారు. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో నిర్వహించిన విధంగానే మిగిలిన జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Also Read: Rahul Gandhi: చైనా రోబోలు పట్టుకొచ్చి.. మనవని చెప్తారా? కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ