Thief Hides in Pond with Lotus Stem: మధ్యప్రదేశ్లో జరిగిన ఒక సినీ తరహా ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రైల్వేల్లో వరుస చోరీలకు పాల్పడుతూ పోలీసులను మోసం చేస్తూ వచ్చిన ఓ అంతర్రాష్ట్ర దొంగను చివరకు Railway Protection Force (RPF) అరెస్ట్ చేసింది. పోలీసుల నుండి తప్పించుకునేందుకు అతడు చేసిన ప్రయత్నాలు, మురికి చెరువులో గంటల తరబడి దాక్కోవడం, ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
పోలీసుల నుండి తప్పించుకునే క్రమంలో నిందితుడు ఏకంగా ఐదు గంటల పాటు మురికి చెరువులో దాక్కొని సినిమా సీన్లను తలపించాడు. శ్వాస తీసుకోవడానికి తామర కాడను పైపులా వాడుకుంటూ పోలీసులకు చుక్కలు చూపించిన ఈ కిలాడీ దొంగను చివరకు గజ ఈతగాళ్ల సాయంతో అదుపులోకి తీసుకున్నారు.
ఈ నెల 6వ తేదీ తెల్లవారుజామున 4:45 గంటల సమయంలో సిహోరా స్టేషన్లో ఆగి ఉన్న రేవా-ఇత్వారి ఎక్స్ప్రెస్లో ఒక మహిళా ప్రయాణికురాలి పర్సు చోరీకి గురైంది. అప్రమత్తమైన RPF సిబ్బంది దొంగను వెంబడించగా.. తప్పించుకోవడానికి మార్గం లేక అతడు రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న ఒక మురికి చెరువులోకి దూకాడు. పోలీసులు చెరువు చుట్టూ ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. నిందితుడు తెలివిగా నీటి అడుగున ఉండి, కేవలం ఒక తామర కాడ ద్వారా గాలి పీల్చుకుంటూ పోలీసుల కళ్లు గప్పాడు. చివరకు స్థానిక గజ ఈతగాళ్లను రంగంలోకి దించడంతో ఐదు గంటల తర్వాత నిందితుడు పట్టుబడ్డాడు.
అరెస్టయిన తర్వాత నిందితుడు తన పేరు, ఊరు గురించి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. అయితే RPF ఇన్స్పెక్టర్ రాజీవ్ ఖరబ్ ఒక పాత వార్తా పత్రిక క్లిప్పింగ్ ఆధారంగా నిందితుడిని సన్నీ అని పిలవడంతో అతడు షాక్ అయి నిజం ఒప్పుకున్నాడు. నిందితుడు ఉత్తరప్రదేశ్ బిజ్నూర్ జిల్లాకు చెందిన 32 ఏళ్ల హర్విందర్ సింగ్ అని తేలింది. ఇతడు గత పదేళ్లలో రైళ్లలో ఏకంగా 500కు పైగా చోరీలకు పాల్పడ్డాడని, వివిధ రాష్ట్రాల్లో ఇతనిపై 21 కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.
హర్విందర్ సింగ్ నేర చరిత్ర పోలీసులను సైతం ఆశ్చర్యపరిచింది. 2018లో ఇతడి వద్ద రూ. 70 లక్షల విలువైన వజ్రాలు, ఆభరణాలు దొరికాయి. ఒకసారి అవంతిక ఎక్స్ప్రెస్లో ప్రయాణికుడి లైసెన్స్డ్ పిస్టల్ను కూడా దొంగిలించాడు. ప్రధానంగా ఏసీ కోచ్లలో మహిళా ప్రయాణికులనే లక్ష్యంగా చేసుకునే ఇతడు, సీసీటీవీల భయంతో స్టేషన్లలో కాకుండా కేవలం రైలు లోపలే దొంగతనాలు చేస్తాడు. పోలీసులకు చిక్కకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి తన రూట్ మార్చేస్తూ మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల పోలీసులకు సవాల్ విసిరాడు.
Read Also: అమెరికాకు భారీ షాక్.. రూ. 1,853 కోట్ల నిఘా డ్రోన్ అదృశ్యం!