పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ శుక్రవారం మధ్యాహ్నం భారీ పేలుడుతో దద్దరిల్లింది. షెహజాద్ టౌన్ పరిధిలోని తర్లాయ్ ఇమామ్బార్గా వద్ద జరిగిన ఈ దారుణ ఘటనలో కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోగా.. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో అధికారులు నగరం అంతటా ‘స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ’ (అత్యవసర పరిస్థితి) ప్రకటించారు.
శుక్రవారం సామూహిక ప్రార్థనలు ముగిసిన కొద్దిసేపటికే ఈ పేలుడు సంభవించింది. ప్రార్థనలు ముగించుకుని ప్రజలు బయటకు వస్తున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు జరగడంతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. ఇది ఆత్మహుతి దాడి కావచ్చని భద్రతా దళాలు ప్రాథమికంగా అనుమానిస్తున్నాయి. పేలుడు ధాటికి సమీపంలోని భవనాలు, వాహనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి.
ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్, భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని వెంటనే పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (PIMS) ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం, దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో కూడా అత్యవసర విభాగాలను అప్రమత్తం చేశారు.
huge blast in #Islamabad in imam bargah…
video resources from Whatsapp group.. pic.twitter.com/XUFvvbUYw6— SyeD ShoMaiL Hashmi (@SyedShomail90) February 6, 2026
పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు పేలుడు జరిగిన ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఆధారాల సేకరణ కోసం ఆ ప్రాంతాన్ని పూర్తిగా సీల్ చేశారు. ఇది ఉగ్రవాద చర్యేనా లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. రాజధాని నగరంలో భద్రతను కట్టుదిట్టం చేసి, చెక్పోస్టుల వద్ద తనిఖీలను పెంచారు. ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ బాధ్యులను వదిలిపెట్టబోమని స్పష్టం చేసింది.
ALSO READ: Maoists Encounter: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 9 మంది మావోలు హతం