Road Accident: జగిత్యాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామ శివారులో జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు రైతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
పంట పొలాల్లో పసుపు కొమ్ములను తీయడానికి వెళ్లి పనులను ముగించుకుని, 15 మంది రైతులు, కూలీలు ట్రాక్టర్పై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మొగిలిపేట గ్రామ శివారుకు చేరుకోగానే, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. ట్రాక్టర్ కింద పడిపోవడంతో నలుగురు రైతులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
ఈ ప్రమాదంలో మిగిలిన 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద రైతులు, పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తూ ఇలా ప్రమాదానికి గురికావడం ఆ కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: ఓటర్లను భయపెట్టినా, బహిష్కరించినా జైలుకే.. అధికారులకు డిజిపి శివధర్ రెడ్డి ఆదేశం