జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానిక యూట్యూబర్ వైష్ణవి హత్య ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. ఇంటికి దీపంగా భావించిన ఆడబిడ్డ ఇక లేదన్న నిజాన్ని ఆమె తోడబుట్టిన వారు అస్సలు నమ్మలేకపోతున్నారు. వైష్ణవి మరణించి మూడు రోజులు గడుస్తున్నా ఆమె అన్నదమ్ములు స్మశాన వాటికను వదిలి వెళ్లడం లేదు. నిరంతరం చెల్లెలి సమాధి చెంతనే ఉంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఆమెపై ఉన్న అపారమైన ప్రేమతో అన్నదమ్ములు చేసిన పని ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. వైష్ణవి సమాధిని రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. తమ సోదరికి ఇష్టమైన పండ్లు, రకరకాల తినుబండారాలను అక్కడికి తీసుకువచ్చారు. ‘వైష్ణవి… నీకు ఇష్టమైన పలహారాలు తెచ్చాను, లేచి తిను తల్లి’ అంటూ ఆమె చిన్నన్న సంతోష్ సమాధిని పట్టుకుని రోదిస్తున్న తీరు అక్కడున్న వారి గుండెలను పిండేస్తోంది. ఆ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు తమ కన్నీళ్లను ఆపుకోలేకపోయారు.
వైష్ణవి ఆ ఇంట్లో అందరికీ ఎంతో ఇష్టమైన వ్యక్తి. చిన్నప్పటి నుండి ఆమెను అల్లారుముద్దుగా పెంచుకున్నామని కుటుంబ సభ్యులు గుర్తు చేసుకుంటున్నారు. తమ కళ్ళ ముందే తిరుగుతూ నవ్వులు పూయించిన ఆడబిడ్డ ఇలా మట్టిలో కలిసిపోవడం జీర్ణించుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె మరణం తమ జీవితాల్లో చీకటి నింపిందని వాపోతున్నారు.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం మాదాపూర్ గ్రామాన్ని శోకసముద్రంలో ముంచెత్తింది. తోడబుట్టిన వారి మధ్య ఉండే అనుబంధానికి ఈ సంఘటన నిలువుటద్దంగా నిలుస్తోంది. మరణించిన సోదరిపై వారు చూపిస్తున్న మమకారం చూసి చుట్టుపక్కల వారు మూగబోతున్నారు. కాలం గడుస్తున్నా వారి బాధ వర్ణనాతీతంగా మారింది.
ALSO READ: BTech Ravi: వివేకా మర్డర్ కేసు.. అవినాష్ రెడ్డి ఆరోపణలపై.. బీటెక్ రవి సెన్సేషనల్ కామెంట్స్