Jangaon: జనగామ జిల్లాలో ఒకే కుటుంబంలో కొన్ని గంటల వ్యవధిలోనే తీవ్ర విషాదాన్ని నింపాయి. ప్రమాదవశాత్తూ నీటి సంపులో పడి రెండేళ్ల చిన్నారి మరణించగా, ఆ ఘోరాన్ని తట్టుకోలేక ఆమె నానమ్మ గుండెపోటుతో అక్కడికక్కడే కన్నుమూసింది. ఈ హృదయవిదారక సంఘటన జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్లో చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబేద్కర్ నగర్కు చెందిన చేర్యాల శేఖర్, లావణ్య దంపతులకు రెండేళ్ల కుమార్తె రియన్సీ ఉంది. బుధవారం ఉదయం చిన్నారి రియన్సీ ఇంటి ముందు ఆడుకుంటూ అందరి కళ్లు గప్పి ప్రమాదవశాత్తూ తెరిచి ఉన్న నీటి సంపు (అండర్గ్రౌండ్ వాటర్ ట్యాంక్) లో పడిపోయింది. కాసేపటికి పాప కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. చివరకు సంపులో చూడగా చిన్నారి నీటిలో మునిగి అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే ఆమెను బయటకు తీసి ఆసుపత్రికి తరలించేలోపే పాప ఊపిరి వదిలేసింది.
కంటిపాపలా చూసుకుంటున్న మనవరాలు కళ్లముందే శవమై కనిపించడంతో నానమ్మ నాగమ్మ (66) తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. కడుపుకోతతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. గుండెపోటు రావడంతో ఆమె కూడా కాసేపటికే ప్రాణాలు విడిచింది. ఆడుతూ పాడుతూ తిరగాల్సిన చిన్నారి, ఆమెను ప్రాణంగా చూసుకునే నానమ్మ ఇద్దరూ ఒకేసారి అనంత లోకాలకు వెళ్లిపోవడంతో ఆ ఇల్లాంతా కన్నీరుమున్నీరవుతోంది. ఒకే ఇంట్లో రెండు శవాలను చూసి బంధువులు, కాలనీవాసులు తట్టుకోలేకపోతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: కర్నూలు జిల్లాలో సరికొత్త చరిత్ర.. జొన్నగిరి బంగారం శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు