దేశంలోనే తెలంగాణను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్ల హబ్గా మార్చాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ బృందం కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నెదర్లాండ్స్కు చెందిన ప్రముఖ పునరుత్పాదక ఇంధన సంస్థ ‘యూపీసీ రిన్యూవబుల్స్’ మరియు వోల్ట్ డేటా సెంటర్స్ సంయుక్తంగా ఏర్పడిన యూపీసీ వోల్ట్ (UPC Volt) సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం (MoU) చేసుకుంది.
ఈ ఒప్పందం ప్రకారం, భారత్ ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల సామర్థ్యంతో అత్యంత అధునాతనమైన ‘ఏఐ అనుకూల డేటా సెంటర్’ను యూపీసీ వోల్ట్ నెలకొల్పనుంది. రాబోయే ఐదేళ్ల కాలంలో ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.5,000 కోట్ల భారీ పెట్టుబడిని సంస్థ వెచ్చించనుంది. ఈ సమావేశంలో యూపీసీ వోల్ట్ సీఈవో హాన్ డీ గ్రూట్, యూపీసీ రిన్యూవబుల్స్ ఏపీఏసీ సహ వ్యవస్థాపకుడు స్టీవెన్ జ్వాన్, ఇండియా సీఈవో అలోక్ నిగమ్లతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చర్చలు జరిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని వివరించారు.
ఈ మెగా ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. నిర్మాణ దశలోనే సుమారు 3,000 మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. డేటా సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత మరో 800 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కేవలం డేటా సెంటర్ మాత్రమే కాకుండా, దీనికి అవసరమైన విద్యుత్ సరఫరా కోసం 100 మెగావాట్ల సామర్థ్యంతో ప్రత్యేక పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ను కూడా సంస్థ ఏర్పాటు చేయనుంది. ఇది పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ నెట్ జీరో లక్ష్యాలకు ఊతమివ్వనుంది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. ఈ ప్రయాణంలో ఆధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయి. అభివృద్ధిని, పర్యావరణ సమతుల్యతను సమానంగా ముందుకు తీసుకెళ్తున్నాం’ అని పేర్కొన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన పూర్తి సహకారాన్ని, ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఫ్యూచర్ సిటీని ఒక గ్లోబల్ టెక్నాలజీ డెస్టినేషన్గా మార్చడంలో ఇది మైలురాయి అని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా పాల్గొన్నారు.