Chain Snatching: జూబ్లీహిల్స్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన చైన్ స్నాచింగ్ ఉదంతం చివరకు నిందితుల అరెస్టుతో ముగిసింది. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి.. అడ్డదారిలో డబ్బు సంపాదించాలనుకున్న ఒక జంట పోలీసులకు చిక్కి ఇప్పుడు జైలు పాలయ్యారు.
ఈ ఘటనలో ప్రధాన నిందితులు నరేంద్ర (23), రేవతి (33). వీరిద్దరి మధ్య పదేళ్ల వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ.. జల్సాల కోసం ఒకటయ్యారు. సనత్ నగర్ ప్రాంతంలో నివసించే వీరిద్దరూ కలిసి సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం ఉదయం.. మాదాపూర్లోని హాస్టల్ నుండి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 39లోని తన కార్యాలయానికి నడుచుకుంటూ వెళ్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ మానసను వీరు లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలోనే ఈ సాహసానికి ఒడిగట్టడం గమనార్హం.
నరేంద్ర యాక్టివా బైక్ నడుపుతుండగా.. వెనుక కూర్చున్న రేవతి మానస మెడలోని బంగారు గొలుసును లాగేసింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ క్రైమ్ పోలీసులు , టాస్క్ఫోర్స్ బృందాలు సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించాయి. నిందితులు వాడిన యాక్టివా బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా దర్యాప్తు చేయగా.. నరేంద్ర ఒక ర్యాపిడో డ్రైవర్గా గుర్తించారు. అతని ఫోన్ సిగ్నల్స్ , కదలికలను ట్రాక్ చేస్తూ పోలీసులు వేట ప్రారంభించారు.
నేరం చేసిన తర్వాత దొరక్కుండా ఉండేందుకు వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్లోని తమ స్వగ్రామాలకు పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే.. సూర్యాపేట సమీపంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వీరిని పోలీసులు వ్యూహాత్మకంగా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తమ విలాసాల కోసం, జల్సాల కోసమే ఈ స్నాచింగ్కు పాల్పడినట్లు వారు అంగీకరించారు. ప్రస్తుతం వీరిద్దరిని రిమాండ్కు తరలించారు.
Also Read: శాడిస్ట్ భర్త.. మద్యం మత్తులో భార్యపై పెట్రోల్ పోసి!