Kadapa Proddatur murder case: కడప జిల్లా ప్రొద్దుటూరులో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తన భార్య అధిక బరువుతో లావుగా ఉందనే కారణంతో ఒక భర్త ఆమెను కడతేర్చాడు. ఏప్రిల్ 30వ తేదీన జరిగిన ఈ అనుమానాస్పద మరణం కేసులో పోలీసులు జరిపిన లోతైన దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. సమాజంలో భార్య వల్ల తన గౌరవం పోతోందని భావించిన నిందితుడు పక్కా ప్లాన్ ప్రకారం ఈ హత్యకు పాల్పడ్డాడు.
దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితుడిని విచారించగా అసలు విషయం ఒప్పుకున్నాడు. తన భార్య ఊబకాయంతో బాధపడుతోందని.. ఆమె ప్రవర్తన సమాజంలో తనను తక్కువ చేసి చూపేలా ఉందని అతను వాదించాడు. దీనికి తోడు నిందితుడికి గతంలో హైదరాబాద్లో ఉన్న సమయంలో మరొక మహిళతో వివాహేతర సంబంధం ఉండేదని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కారణాలతోనే భార్యను వదిలించుకోవాలని అతను నిర్ణయించుకున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భార్యను ఎలా చంపాలనే అంశంపై నిందితుడు ముందుగా యూట్యూబ్, గూగుల్ లో వెతికాడు. ముఖ్యంగా ఎవరికీ అనుమానం రాకుండా విషం ఇచ్చి ఎలా చంపాలనే దానిపై సెర్చ్ చేసి ఒక నంబరును సంప్రదించాడు. ఆ వ్యక్తి ద్వారా ఆన్లైన్లో విషాన్ని తెప్పించుకున్నాడు. ఏప్రిల్ 29వ తేదీ రాత్రి భార్యకు పాలకోవాలో విషం కలిపి ఇచ్చాడు. అది తిన్న వెంటనే ఆమె స్పృహ తప్పి కింద పడిపోయింది. విషం ప్రభావం వల్ల ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లినప్పటికీ.. పూర్తిగా ప్రాణాలు పోలేదని గమనించిన నిందితుడు మరింత క్రూరంగా వ్యవహరించాడు. ఆమె తల పైన దిండు పెట్టి అదిమి పట్టుకున్నాడు. సుమారు 40 నిమిషాల పాటు ఆమెపై మోకాళ్లతో నొక్కి పెట్టి ప్రాణాలు పోయే వరకు అలాగే ఉన్నాడు. హత్య జరిగిన తర్వాత ఏమీ తెలియనట్లుగా పక్కనే పడుకుని నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.
బాధితురాలి వయస్సు 31 సంవత్సరాలు అని.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి ఆధారాలతో నిందితుడిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. బాడీ షేమింగ్.. వివాహేతర సంబంధం వంటి కారణాలతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు వెల్లడించారు. సాంకేతిక ఆధారాలు ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించాయి.
Read Also: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు మృతి.. భార్య పరిస్థితి విషమం!