కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పుష్పగిరి వద్ద పెన్నా నదిలో గల్లంతైన ఇద్దరు యువకులు విగతజీవులుగా కనిపించారు. ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా గడపాలని వెళ్లిన ఆ యువకుల ప్రాణాలు నీటిపాలయ్యాయి. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కడప నగరానికి చెందిన శ్రీనాథ్, చైతన్య స్నేహితులతో కలిసి నిన్న మధ్యాహ్నం పుష్పగిరి క్షేత్రానికి చేరుకున్నారు. పెన్నా నదిలో స్నానాలు చేస్తుండగా నీటి ఉధృతిని గమనించలేకపోయారు. అక్కడ ఉన్న సుడిగుండాలను గుర్తించకుండా లోతు ప్రాంతంలోకి దిగడంతో ప్రమాదం జరిగింది. క్షణాల్లోనే నీటి ప్రవాహానికి యువకులు ఇద్దరూ కొట్టుకుపోయారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సిబ్బంది రంగంలోకి దిగారు. నిన్న సాయంత్రం చీకటి పడేవరకు గాలించినా ఆచూకీ దొరకలేదు. నేటి ఉదయం నుంచి పోలీస్ సిబ్బంది, స్థానిక గజ ఈతగాళ్లు పెన్నా నదిలో విస్తృతంగా గాలింపు చేపట్టారు. పుష్పగిరి నుంచి సుమారు ఒక కిలోమీటర్ దూరంలో రెండు మృతదేహాలు వేర్వేరు చోట్ల లభ్యమైనట్టు అధికారులు గుర్తించారు.
మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అప్పటివరకు ప్రాణాలతో వస్తారని ఆశించిన తల్లిదండ్రులు కొడుకుల మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. కడప నగరంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నదుల వద్దకు వెళ్లేటప్పుడు హెచ్చరికలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
ALSO READ: Interesting Facts: పైలట్లు రొయ్యలు, పీతలు ఎందుకు తినరు? వారి క్యాప్ లో ఫొటోలు ఎందుకు పెట్టుకుంటారు?