Kerala Incident: వ్యూస్ కోసం, ఫాలోవర్స్ కోసం నేటి యువతలు అడ్డమైన దారులు తొక్కుతున్నారు. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచడానికి కేరళలో ఓ యువతి చేసిన పని నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘటన పూర్తి సమాచారంలోకి వెళితే..
అవాస్తవ ఆరోపణ – ఒక ప్రాణం బలి
కేరళలోని కోజికోడ్కు చెందిన దీపక్ (28) ఒక ప్రైవేట్ దుస్తుల కంపెనీలో పనిచేస్తూ సామాన్య జీవితాన్ని గడుపుతున్నాడు. అయితే, ఇటీవల ఒక యువతి బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో దీపక్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఏమాత్రం ఆలోచించకుండా ఆ యువతి చేసిన ఆరోపణలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. వేలమంది నెటిజన్లు ఆ వీడియోను షేర్ చేస్తూ, దీపక్ను ఒక నేరస్తుడిగా ముద్ర వేసి తీవ్రస్థాయిలో విమర్శలు, అసభ్యకర కామెంట్లు కురిపించారు.
వైరల్ అయిన ఆ వీడియో దీపక్ వ్యక్తిగత, సామాజిక జీవితాన్ని అతలాకుతలం చేసింది. తాను ఏ తప్పూ చేయలేదని, కేవలం రద్దీగా ఉన్న బస్సులో సాధారణంగా నిలబడ్డానని చెప్పే అవకాశం కూడా అతనికి దక్కలేదు. సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్, చుట్టుపక్కల వారి హేళనలు, అవమానాలను భరించలేక దీపక్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సమాజంలో తలెత్తుకోలేక, తన నిజాయితీని నిరూపించుకోలేక గోవిందాపురంలోని తన నివాసంలోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు.
దీపక్ మరణం తర్వాత ఈ కేసు మరో మలుపు తిరిగింది. ప్రాథమిక విచారణలో ఆ యువతి చేసిన ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని, కేవలం ఫాలోవర్లను పెంచుకోవడానికి లేదా తప్పుడు ఉద్దేశంతోనే ఆ వీడియోను చిత్రీకరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్యాయంగా ఒక యువకుడిని బలితీసుకున్న ఆ యువతిపై కఠిన చర్యలు తీసుకోవాలని దీపక్ కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ప్రస్తుతం ఆ వీడియో మూలాలను, యువతి ఉద్దేశాన్ని విచారిస్తున్నారు.
Also Read: పారిశ్రామిక దిగ్గజాలతో వరుస భేటీలు.. దావోస్ సదస్సులో బిజీ బిజీగా సీఎం చంద్రబాబు
ఈ ఘటన సోషల్ మీడియా వాడకంపై తీవ్ర చర్చకు దారితీసింది. నేటి యువత కేవలం ‘లైక్స్’, ‘వ్యూస్’ కోసం ఇతరుల జీవితాలతో ఆడుకోవడం అత్యంత విచారకరం. ఒక వ్యక్తిపై బహిరంగంగా ఆరోపణలు చేసే ముందు చట్టం ద్వారా ఫిర్యాదు చేయాలే తప్ప, ఇలా ‘డిజిటల్ పబ్లిసిటీ’ కోసం తప్పుడు ప్రచారం చేయడం నేరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆధారాలు లేకుండా వ్యక్తిత్వ హననానికి పాల్పడితే అది ఆత్మహత్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.