MMTs assault Incident: ఎంఎంటీఎస్(MMTS)లో అత్యాచారయత్నానికి ఒడిగట్టిన నిందితుడిని పోలీసులు ఐడెంటిఫై చేశారు. దారుణానికి పాల్పడింది.. మేడ్చల్ గౌడవెల్లి ప్రాంతానికి చెందిన మహేష్గా గుర్తించారు. నిందితుడు జంగం మహేశ్ ఫోటోను బాధితురాలికి పోలీసులు చూపించారు. రైలులో తనపై లైంగిక దాడికి యత్నించింది.. మహేశేనని ఫోటో ఆధారంగా యువతి గుర్తించింది. ఏడాది క్రితమే మహేశ్ ను భార్య వదిలేసింది. తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో మహేశ్ ఒంటరిగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో గంజాయికి బానిసైన మహేశ్ కు క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది. ప్రస్తుతం మహేష్ ను పోలీసులు విచారిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్లోని ఎంఎంటీఎస్ ట్రైన్లో యువతిపై అత్యాచార యత్నం చేసిన దుండగుడిని గుర్తించారు పోలీసులు. గౌడవెల్లి ప్రాంతానికి చెందిన మహేష్ కోసం గాలిస్తున్నారు. నిన్న సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భయంలో యువతి ట్రైన్ నుంచి దూకేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. పట్టలపై పడిఉన్న యువతిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. తల, నోటి భాగంలో గాయాలు కావడంతో.. సర్జరీ కోసం యశోద ఆస్పత్రికి తరలించారు. యువతి పరిస్థితి నిలకడగా ఉందని, ఇవాళ సాయంత్రం సర్జరీ చేసే అవకాశం ఉందన్నారు డాక్టర్లు.
అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన యువతి… ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చింది. మేడ్చల్లోని లేడీస్ హాస్టల్లో ఉంటూ స్విగ్గీలో ఇన్వెంటరీగా వర్క్ చేస్తోంది. ఫోన్ రిపేర్ కోసం రెండ్రోజుల క్రితం మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వచ్చింది. పని పూర్తయ్యాక… రాత్రి 8 గంటల 20 నిమిషాలకు రిటర్న్ జర్నీలో MMTS ఎక్కింది. ఆ బోగీలో మొత్తం ముగ్గురు మహిళలు ఉన్నారు. ఇద్దరు మహిళలు అల్వాల్ స్టేషన్లో దిగిపోయారు. దాంతో ఆ యువతి ఒంటరిగా మిగిలిపోయింది. అదే ఛాన్స్గా భావించిన దుండగుడు…ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.దీంతో భయపడ్డ యువతి భయంతో రన్నింగ్ కొంపల్లి సమీపంలో ట్రైన్ నుంచి దూకేసింది.
జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నాలుగు బృందాలుగా విడిపోయి.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకున్న రైల్వే స్టేషన్స్లో కొన్నిచోట్ల సీసీ కెమెరాలు లేవని పోలీసులు తెలిపారు. ఉన్న వాటి ద్వారా నిందితుడు ఎటువెళ్లాడని జల్లెడ పడుతున్నారు.
Also Read: బెట్టింగ్ యాప్ ఎఫెక్ట్.. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య
ఇదిలా ఉంటే.. ఎంఎంటీఎస్ నుంచి దూకి గాయాలపాలై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి కుటుంబ సభ్యులతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫోన్ లో పరామర్శించారు. ఆ యువతి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. జరిగిన ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత జిల్లాకు చెందిన ఆ యువతి కుటుంబ సభ్యులు అధైర్యపడొద్దని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు.
కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆ యువతికి మెరుగైన చికిత్స అందించేందుకు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. తర్వాత బండి సంజయ్ బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డికి ఫోన్ చేసి వెంటనే సదరు యువతిని సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య చికిత్సను అందించాలని సూచించారు. బండి సంజయ్ సూచన మేరకు డాక్టర్ శిల్పారెడ్డి హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి వెళ్లి అఫ్రోజ్ ను యశద ఆసుపత్రికి తరలించారు. ఇటు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామరావు పటేల్, పాల్వాయి హరీశ్ బాబు చేరుకొని పరామర్శించారు.