HIV Injection Case: కర్నూలు నగరంలో సంచలనం సృష్టించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రావణికి హెచ్ఐవి (HIV) ఇంజక్షన్ ఇచ్చిన కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో తాజాగా మరో ఆసక్తికరమైన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. నిందితురాలు వసుంధర, ఆమెకు సహకరించిన నర్సు సరిత మధ్య ఉన్న సంబంధాన్ని పోలీసులు గుర్తించారు.
కర్నూలు జీజీహెచ్ (GGH)లో నర్సుగా పనిచేస్తున్న సరిత, వసుంధర, జ్యోతి ముగ్గురు ఎమ్మెస్సీ నర్సింగ్ చదువుతున్న సమయంలో క్లాస్మేట్స్ అని తేలింది. ఈ పాత పరిచయంతోనే సరిత డిసెంబర్ 27వ తేదీన తన నైట్ డ్యూటీ సమయంలో ఆసుపత్రి నుంచి హెచ్ఐవి సోకిన బ్లడ్ శాంపిల్ను బయటకు పంపి వసుంధరకు అప్పగించినట్లు నిర్ధారణ అయింది. అయితే, ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన నర్సు సరితపై ఆసుపత్రి అధికారులు ఇంతవరకు ఎటువంటి సస్పెన్షన్ వేటు వేయకపోవడం గమనార్హం.
ఈ అమానవీయ ఘటన వెనుక ఉన్న కారణాలను పరిశీలిస్తే, నిందితురాలు వసుంధర మరియు కిరణ్ కుమార్ అనే వ్యక్తి స్కూల్ రోజుల నుంచి ప్రేమించుకున్నారు. కొన్ని ఏళ్ల పాటు సాగిన వీరి ప్రేమాయణం, మనస్పర్థల కారణంగా విడిపోవడానికి దారితీసింది. ఆ తర్వాత కిరణ్ కుమార్, కర్నూలు జీజీహెచ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ శ్రావణిని వివాహం చేసుకున్నారు. తన మాజీ ప్రియుడు మరొకరిని పెళ్లి చేసుకోవడాన్ని తట్టుకోలేని వసుంధర, శ్రావణిపై పగ పెంచుకుంది. ఆమె జీవితాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కిరాతక ప్లాన్ వేసింది.
ఈనెల 9వ తేదీన డాక్టర్ శ్రావణి తన విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా, వసుంధర పంపిన నలుగురు వ్యక్తులు ద్విచక్ర వాహనంతో ఆమెను ఢీకొట్టారు. ప్రమాదానికి గురై కిందపడిన శ్రావణికి సహాయం చేస్తున్నట్లు వసుంధర నటించింది. ఆమెను ఆటోలో ఎక్కించే క్రమంలో, తన వద్ద సిద్ధంగా ఉన్న హెచ్ఐవి వైరస్ ఇంజక్షన్ను శ్రావణికి ఎక్కించింది. ఈ ఘటనలో పాలుపంచుకున్న నలుగురు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వసుంధరకు సహకరించిన మరో నర్సు కుమారుడు, కూతురు కూడా ఈ కుట్రలో భాగస్వాములైనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ప్రస్తుతానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రావణి ఒక ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లో పరీక్షలు చేయించుకోగా, హెచ్ఐవి రిపోర్టులో నెగిటివ్ వచ్చినట్లు సమాచారం అందింది. అయితే, వైరస్ ప్రభావం బయటపడటానికి కొంత సమయం పడుతుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, మాజీ ప్రియురాలు వసుంధరకు సంబంధించిన పాత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ కేసులో మరికొంతమంది వైద్య సిబ్బంది ప్రమేయం ఉందనే అనుమానంతో పోలీసులు ఆ కోణంలో ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన కర్నూలు వైద్య ఆరోగ్య శాఖలో పెను కలకలం రేపింది.
Read Also: బెంగుళూరు యాక్సిడెంట్.. ప్లాన్ ప్రకారం హత్య, అడ్డంగా బుక్కైన టెక్కీ