కర్నూలు జిల్లాలో పాత కక్షలు మరోసారి భగ్గుమన్నాయి. ఎమ్మిగనూరు సమీపంలోని కందనాతి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామ శివారులో పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తున్న క్రమంలో ప్రత్యర్థులు వేటకొడవళ్లతో కాపు కాసి దాడి చేశారు. ఈ దాడిలో వెంకటేష్, పరమేష్ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గతేడాది జరిగిన హత్యలకు ప్రతీకారంగానే ఈ ఘాతుకం జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పోలీసులు, స్థానికుల సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన వెంకటేష్ తన పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరగా.. గ్రామ శివారులో అప్పటికే కాపు కాసిన ప్రత్యర్థులు ఒక్కసారిగా వేటకొడవళ్లతో విరుచుకుపడ్డారు. తప్పించుకునే అవకాశం లేకుండా వెంటాడి వేటాడి నరకడంతో వెంకటేష్ అక్కడే కుప్పకూలిపోయారు. అదే సమయంలో గ్రామంలోని ఇంటి వద్ద ఉన్న పరమేష్ను కూడా ప్రత్యర్థులు లక్ష్యంగా చేసుకుని దాడి చేయడంతో ఆయన కూడా అక్కడికక్కడే మృతి చెందారు.
దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన గోవింద్, లోకేంద్ర అనే ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గోవింద్ భార్య విరేషమ్మకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన గోవింద్ పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో.. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయనను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లోకేంద్ర ప్రస్తుతం ఎమ్మిగనూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
పాత కక్షలే కారణం..
ఈ దారుణానికి భూ తగాదాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. గత కొంతకాలంగా రెండు వర్గాల మధ్య పొలం విషయంలో వివాదాలు నడుస్తున్నాయి. గత ఏడాది గ్రామంలో జరిగిన కొన్ని హత్యలకు సంబంధించి కోర్టులో కౌంటర్ దాఖలు చేయడంతో వర్గ పోరు మరింత ముదిరింది. ఆ హత్యలకు ప్రతీకారంగానే ఇప్పుడు ప్లాన్ ప్రకారం.. ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనతో కందనాతి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఫ్యాక్షన్ గొడవలు మళ్ళీ తెరపైకి రావడంతో జిల్లా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
ALSO READ: Actor Kannan Pattambi Death: కిడ్నీ వ్యాధితో ప్రముఖ నటుడు మృతి!