Vizag Crime: సహజీనవం పచ్చని సంసారంలో చిచ్చు పెడుతోంది. ఫలితంగా భాగస్వాములు ఆవేశాలను లోనవుతున్నారు. ఒకరిని మరొకరు చంపుకునే ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన విశాఖ సిటీలో వెలుగుచూసింది. పార్టనర్ని కుర్చీతో కొట్టి చంపేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటనకు సంబంధించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలేం జరిగింది?
సహజీవనంలో చిచ్చురేసింది
విశాఖ సిటీలో ఓ మహిళ దారుణహత్యకు గురైంది. వేపగుంట ఏరియాలోని అప్పన్నపాలెంలోని ఓ అపార్టుమెంటులో ఉంటోంది. ఆమె పేరు దేవి, వయస్సు 34 ఏళ్లు. ఆమె సొంతూరు విజయనగరం పట్టణంలోని రాజీవ్నగర్ ప్రాంతానికి చెందినది. మరి ఎక్కడ ఏం జరిగిందో తెలీదుగానీ, సమీపంలోని శ్రీనివాసరావు అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది.
అది కాస్త స్నేహంగా మారింది. ఆ తర్వాత సహజీవనానికి దారి తీసింది. ఆదివారం మధ్యాహ్నం డబ్బుల విషయంలో శ్రీనివాసరావు-దేవి మధ్య మాటా మాటా పెరిగింది. చివరకు ఘర్షణకు దారి తీసింది. ఫ్లాట్లో పెద్ద పెద్ద అరుపులు రావడంతో మహిళా వాచ్మెన్ దేవి ఫ్లాట్కి వెళ్లింది. ఇది మా ఫ్యామిలీ మేటరని, ఇందులో ఎవరూ తల దూర్చవద్దంటూ దేవి చెప్పడంతో వాచ్మెన్ వెళ్లిపోయింది.
భాగస్వామిని ఛైర్తో కొట్టి చంపేశాడు
ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదుగానీ.. కొద్దిసేపటికి శ్రీనివాసరావు ఆ ఫ్లాట్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. దీంతో అక్కడ నిశబ్దంగా ఉండడంతో మహిళా వాచ్మేన్ అనుమానం వచ్చింది. ఆ ఫ్లాట్కి వెళ్లి చూసింది. ఇంటికి తాళాలు వేసి ఉండడంతో అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది.
పోలీసులు అక్కడికి వచ్చి తలుపులు పగలగొట్టి చూసేసరికి రక్తపు మడుగులో దేవి కనిపించింది. అప్పటికే ఆమె చనిపోయింది. ఆమెపై ఏ విధంగా దాడి చేశారనే కోణంలో అక్కడి పరిసరాలను గమనించారు పోలీసులు. చివరకు ఐరన్ ఛైర్ కొట్టి ఆమెని హత్య చేసినట్టు నిర్ధారించారు. ఆధారాల కోసం క్లూస్ టీమ్ అక్కడికి చేరుకుంది.
కుర్చీతో బలంగా కొట్టడంతో మెడ, ముఖంపై దాడి చేసినట్లు తేలింది. దేవికి పలుచోట్ల తీవ్రగాయాలు ఉన్నాయి. అపార్టుమెంట్ సీసీఫుటేజ్ పరిశీలించారు పోలీసులు. అయితే మహిళా వాచ్మేన్ పోలీసులకు ఓ విషయం చెప్పింది. సమీపంలోని శ్రీనివాసరావు అనే వ్యక్తి నిత్యం ఫ్లాట్కు వస్తుంటాడని, ముఖానికి మాస్క్ వేసుకుంటాడని తెలిపింది.
ALSO READ: అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం.. నీటి సంపులోపడి అన్నదమ్ముల దుర్మరణం
గతంలో శ్రీనివాసరావు మోసం చేసిన కేసులో జైలుకెళ్లి వచ్చాడు. ఈ క్రమంలో దేవితో అతడికి విభేదాలు వచ్చినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాసరావు ఫ్యామిలీ చినముషిడివాడ లక్ష్మీనగర్లో ఉంటోంది. నిందితుడి కుటుంబానికి వీరి సహజీవనంపై సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం నిందితుడు శ్రీనివాసరావు పరారీలో ఉన్నాడు. ఆచూకీ కోసం మూడు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తు సాగుతోందని పోలీసులు తెలిపారు. అటు దేవి బంధువులకు కబురు పెట్టారు. నిందితుడు చిక్కితే ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.