Madanapalle Crime: అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. స్థానిక చేనేత కార్మికుడు గోపీనాథ్ కుమార్తె, ఏడేళ్ల రిషిక ప్రియ సోమవారం సాయంత్రం 4:30 గంటల సమయంలో ఇంటి వద్ద ఆడుకుంటూ అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారి అదృశ్యంపై జిల్లా ఎస్పీ, డీఎస్పీలు వెంటనే స్పందించి గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసులు రంగంలోకి దిగి స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. బయట ఆడుకుంటున్న సమయంలో ఎవరు లేనిది చూసి బాలికకు మాయమాటలు చెప్పి పక్కింట్లో నివసించే వ్యక్తి తన నివాసంలోకి తీసుకెళ్లినట్లు దృశ్యాల ద్వారా గుర్తించారు. దీంతో అనుమానితుడి ఇంటిని తనిఖీ చేయగా, అక్కడ ఒక డ్రమ్ములో రిషిక ప్రియ మృతదేహం లభ్యమైంది. బాలికను అత్యంత క్రూరంగా హత్య చేసి, ఆపై ఎవరికీ తెలియకుండా నీటి డ్రమ్ములో కుక్కి దాచినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అయితే సదరు వ్యక్తి మానసిక స్థితి సరిగా లేని వాడిగా (సైకో) స్థానికులు భావిస్తున్నారు. ఈ అమానుష ఘటనతో మదనపల్లి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్పటివరకు కళ్లముందే ఆడుకున్న చిన్నారి విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: కడపలో ఘోర ప్రమాదం.. మద్యం మత్తులో డ్రైవర్ జనాలపైకి దూసుకెళ్లిన కారు.. స్పాట్లో
ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ హత్య వెనుక ఉన్న అసలు కారణాలు, ఇతర కోణాలను వెలికితీసేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు. అసలు బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి ఏమైనా చేశాడా? లేదా కావాలనే చంపేశాడా? అనేది పోస్టుమార్టం వివరాల్లో తెలియాల్సి ఉంది. నేరస్తులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని ఉన్నతాధికారులు భరోసా ఇచ్చారు.
ఘటనపై స్పందించిన హోమ్ మంత్రి అనిత..
మదనపల్లి ఘటనపై స్పందించిన హోమ్ మంత్రి అనిత వంగలపూడి.. అయితే ఈ ఘటనపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నాని తెలిపారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు కచ్చితంగా చట్టపరంగా చర్యలు ఉంటాము.. ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని మంత్రి అనిత తెలిపారు.