మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పెను సంచలనం రేకెత్తించిన దారుణం వెలుగుచూసింది. వివాహేతర సంబంధం చివరకు ఒకరి ప్రాణం మీదికి తెచ్చి మరొకరిని మృత్యువు అంచున నిలబెట్టింది. అనుమానం పెనుభూతమై ఇద్దరు వ్యక్తుల జీవితాలను బుగ్గిపాలు చేసింది. కురవి మండలం మోదుగుల గూడెం గ్రామానికి చెందిన కుంట అంజయ్య కొన్నాళ్లుగా మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ ఎదురుగా పాల షాప్ నడుపుతున్నాడు. రెండేళ్ల క్రితం భార్య చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్న అంజయ్యకు బానోత్ పద్మ అనే మహిళతో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది.
గత కొంతకాలంగా పద్మ మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని అంజయ్య తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తనను కాదని వేరొకరితో ఉండటం జీర్ణించుకోలేకపోయిన అంజయ్య ఆమెపై విపరీతమైన కోపం పెంచుకున్నాడు. పద్మ తనకు దక్కకపోతే మరెవరికీ దక్కకూడదనే మొండి వైఖరితో ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే పద్మ ప్రగతి నగర్లోని తన తల్లి నివాసానికి వచ్చిందని తెలుసుకున్న అంజయ్య పథకం ప్రకారం పెట్రోల్ బాటిల్తో అక్కడికి చేరుకున్నాడు.
ఇంట్లోకి ఒక్కసారిగా చొరబడిన అంజయ్య చూస్తుండగానే పద్మపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. క్షణాల్లో మంటలు చెలరేగడంతో ఆమె భీతావహంగా కేకలు వేసింది. వెంటనే అంజయ్య కూడా తనపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. ఇద్దరూ మంటల్లో కాలిపోతుండటం గమనించిన స్థానికులు పరుగులు తీసి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ వెంటనే జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రాథమిక విచారణలో వివాహేతర సంబంధం వేరొకరితో కొనసాగిస్తోందనే అనుమానమే ఈ దారుణానికి కారణమని తేలింది. పద్మకు భర్తతో పాటు ఇద్దరు పిల్లలు ఉండగా అంజయ్యకు కూడా ముగ్గురు సంతానం ఉన్నారు. క్షణికావేశం రెండు కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.
ALSO READ: NIT Campus: కురుక్షేత్ర నిట్లో దారుణం.. తెలంగాణ స్టూడెంట్ ఆత్మహత్య, విద్యార్థి పేరెంట్స్ అనుమానాలు