Kagaznagar: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. పట్టణ కేంద్రంలోని స్థానిక అయ్యంగార్ బంగళూర్ బేకరీలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వ్యాపారం ముగించుకుని యజమానులు ఇళ్లకు వెళ్లిన కాసేపటికే ఈ ప్రమాదం జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
షార్ట్ సర్క్యూటే కారణం..
ప్రాథమిక సమాచారం ప్రకారం.. బేకరీలో జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి వేళ లోపల ఒక్కసారిగా మంటలు చెలరేగి, బేకరీ మొత్తం వేగంగా వ్యాపించాయి. లోపల ఉన్న ఫ్రిజ్లు, ఓవెన్లు, ఫర్నిచర్తో పాటు అమ్మకానికి సిద్ధంగా ఉంచిన బేకరీ పదార్థాలన్నీ మంటల్లో పూర్తిగా కాలి బూడిదయ్యాయి. దట్టమైన పొగలు, మంటలను గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థబయలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
రూ.20 లక్షల ఆస్తి నష్టం..
ఈ ఘోర ప్రమాదంలో సుమారు రూ.20 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బేకరీ యజమానులు కన్నీటి పర్యంతమవుతూ తెలిపారు. కంటి ముందే జీవితాధారమైన వ్యాపారం సర్వనాశనం కావడంతో వారు కోలుకోలేకపోతున్నారు. ఎంతో కాలంగా కష్టపడి నిర్మించుకున్న దుకాణం ఇలా క్షణాల్లో బూడిద కుప్పగా మారడం చూసి స్థానికులు సైతం చలించిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ప్రభుత్వమే తమ్మును ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.