Rajamouli Perfection: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సినిమా తీస్తున్నారంటే అందులో పర్ఫెక్షన్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ప్రతి సీన్ను, ప్రతి ఫ్రేమ్ను ఎంతో అద్భుతంగా మలచడానికి ఎంత సమయమైనా కేటాయిస్తారు. తాజాగా ఈ విషయాన్ని మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్ర సెట్స్లో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను ఆయన పంచుకున్నారు.
Read also-పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?
ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ మాట్లాడుతూ, ‘వారణాసి’ సినిమా షూటింగ్ సమయంలో ఎదురైన ఒక క్రేజీ అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ఒక నిర్దిష్టమైన సీన్ కోసం తాను, మహేష్ బాబు కలిసి ఉదయాన్నే సెట్స్పైకి వచ్చామని.. అయితే ఆ షాట్ రాజమౌళి అనుకున్నట్లుగా పర్ఫెక్ట్గా రాకపోవడంతో టేక్స్ మీద టేక్స్ తీసుకుంటూనే ఉన్నారని చెప్పారు. లంచ్ బ్రేక్ సమయానికి కూడా ఆ షాట్ ఓకే కాలేదని, మళ్లీ తిన్న వెంటనే షూటింగ్ మొదలుపెట్టారని తెలిపారు.
చివరికి సాయంత్రం 6:30 గంటలవుతున్నా ఆ ఒక్క షాట్ కోసం దాదాపు 90 కి పైగా (94 లేదా 97) టేక్స్ తీసుకున్నారని పృథ్వీరాజ్ వెల్లడించారు. అంత సమయం తీసుకున్నప్పటికీ రాజమౌళి సంతృప్తి చెందకపోవడంతో.. “ఈ రోజుకు ప్యాకప్.. రేపు ఉదయం మళ్లీ ఇదే షాట్ చేద్దాం” అని చెప్పడంతో తాము షాక్ అయ్యామని, ఆ రోజు షూటింగ్ అనుభవం ఎప్పటికీ మర్చిపోలేనని ఆయన నవ్వుతూ చెప్పుకొచ్చారు.
రాజమౌళి పని రాక్షసుడని, ఆయనకు సినిమాపై ఉన్న అంకితభావం చూస్తే ముచ్చటేస్తుందని పృథ్వీరాజ్ ప్రశంసించారు. ఉదయం 7 గంటలకు షూటింగ్ అంటే, ఆయన అంతకంటే ముందే 5:15 గంటలకే సెట్స్కు చేరుకుని అసిస్టెంట్లతో కలిసి 12 సార్లు రిహార్సల్స్ పూర్తి చేసి నటీనటుల కోసం వేచి చూస్తుంటారని అన్నారు. లంచ్ బ్రేక్ కూడా కేవలం 20 నిమిషాలే ఉంటుందని, షూటింగ్ సమయంలో ఆయన అస్సలు కుర్చీలో కూర్చోరని రాజమౌళి వర్కింగ్ స్టైల్ను వివరించారు.
Read also-అడ్డంకులను దాటి ఒక్కటైన జంట.. రిజిస్టర్ ఆఫీస్లో ‘జబర్దస్త్’ ఫైమా, ప్రవీణ్ నాయక్ వివాహం!
ఇంతటి భారీ స్కైల్లో తెరకెక్కుతున్న చిత్రాన్ని తాను తన కెరీర్లో ఇప్పటివరకు చూడలేదని పృథ్వీరాజ్ అన్నారు. నటుడిగా రాజమౌళి విజన్ను పూర్తిగా నమ్మి ఆయన చెప్పింది చేయడమే మన పని అని, అవుట్పుట్ చూసినప్పుడు ఆయన అంత పర్ఫెక్షన్ ఎందుకు ఆశించారో అర్థమవుతుందని పేర్కొన్నారు.
మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఈ గ్లోబల్ అడ్వెంచర్ సినిమాపై పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఒక్క షాట్ కోసమే ఇన్ని టేక్స్ తీసుకున్నారంటే.. ఇక సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందోనని ఇటు మహేష్ బాబు అభిమానులు, అటు సినీ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.