Medak Crime: భార్యాభర్తల మధ్య అనురాగం, ఆప్యాయతలు ఉండాల్సిన ఈ రోజుల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. చివరకు పెనుభూతంగా మారుతోంది. హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా భార్యపై అనుమానంతో మూడేళ్ల కొడుకుని చంపేశాడు కన్నతండ్రి. సంచలనం రేపిన ఈ ఘటన మెదక్ జిల్లాలో వెలుగుచూసింది.
మెదక్ జిల్లాలో దారుణం.. భార్యపై అనుమానం
మెదక్ జిల్లా తిమ్మక్కపల్లి తండాకు చెందిన అమీనాతో ఆరేళ్ల కిందట భాస్కర్కు వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు కొడుకులు, ఒకరి పేరు శ్రీకుమార్, మరొకరు లక్కీ. హాయిగా.. ప్రశాంతంగా సాగుతున్న సంసారంలో ఒక్కసారిగా కలతలు మొదలయ్యాయి. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు, ఆపై గొడవలకు దారితీసింది.
కొన్నిరోజులుగా భార్య అమీనాపై భాస్కర్కు అనుమానం మొదలైంది. ఈ క్రమంలో భార్యని చీటికి మాటికి వేధించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలకు దారి తీసింది. ఈ దంపతుల మధ్య గొడవలు రోజురోజుకూ గొడవలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఎక్కడా ఫుల్స్టాప్ పడలేదు.
కోపం పట్టలేక కొడుకుని హత్య చేసిన తండ్రి
నాలుగు రోజుల కిందట భాస్కర్ తన భార్యని కొట్టాడు. కోపంతో తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లిపోయింది అమీనా. కూతురికి వైద్యం చేయించాడు ఆమె తండ్రి. పిల్లలను భర్త భాస్కర్ వద్ద వదిలేసింది. ఉన్నట్లుండి భార్య వెళ్లిపోవడం తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు భాస్కర్.
రోజు రోజుకూ కోపం రెట్టింపు అయ్యింది. పిల్లలు వల్లే తమ మధ్య గొడవలకు కారణమైందని భావించాడు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి నిద్రపోతున్న చిన్న కొడుకు లక్కీని గొంతు నులిమి హత్య చేశాడు. ఆదివారం ఉదయం కొడుకు మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లాడు. బాలుడ్ని పరీక్షించిన వైద్యులు, మృతి చెందాడని చెప్పేశారు.
ALSO READ: ఇంటి ముందు కూర్చొంటే.. ట్రక్ రూపంలో వచ్చిన మృత్యువు
కొడుకు మృతి విషయాన్ని భాస్కర్.. బంధువుల ద్వారా భార్యకు చేరవేశాడు. భార్య, ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రికి వచ్చారు. కొడుకుని ఆ విధంగా చూసి ఆ తల్లి కన్నీరుమున్నీరు అయ్యింది. బాలుడి మెడపై గాయం ఉండడం చూసింది. కొడుకు మృతి వెనుక భర్త కారణమని భావించింది. చివరకు పోలీసులకు సమాచారం ఇచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు భాస్కర్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి బాలుడి మృతదేహాం ఇంకా ఆసుపత్రిలో ఉంది.