Bus Accident: మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక చిన్నారితో సహా 10 మంది మృతి చెందగా, మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. మెక్సికో సిటీ నుంచి వెరాక్రూజ్ రాష్ట్రంలోని చికోంటెపెక్ గ్రామానికి ప్రయాణిస్తున్న బస్సు, జోంటెకోమాట్లాన్ ప్రాంతం వద్ద ప్రమాదానికి గురైంది. కొండ ప్రాంతంలో ప్రయాణిస్తున్న సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు రహదారి నుంచి దారి తప్పి లోయలోకి పడిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు.
ప్రమాదం జరిగిన వెంటనే పలువురు ప్రయాణికులు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సమీప ఆసుపత్రికి తరలించారు. లోయలో పడిపోయిన బస్సు నుంచి ప్రయాణికులను బయటకు తీసేందుకు గంటల తరబడి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు. క్రేన్ల సహాయంతో బస్సును బయటకు తీసే ప్రయత్నాలు చేపట్టారు.
ఈ ప్రమాదం అతివేగం లేదా సాంకేతిక లోపం కారణంగా జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కొండ ప్రాంతాల్లో వంపులు ఎక్కువగా ఉండటంతో డ్రైవర్ వేగాన్ని నియంత్రించలేకపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Also Read: భార్యపై అనుమానంతో పెట్రోల్ పోసి నిప్పు అంటించిన భర్త.
ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు పూర్తిస్థాయి విచారణ చేపట్టినట్లు.. మెక్సికో అధికారులు వెల్లడించారు. ఈ విషాద ఘటనపై వెరాక్రూజ్ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించింది. అవసరమైతే అదనపు వైద్య సాయాన్ని అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.